ఆటుపోట్లకే అధిక చాన్స్‌ | Iran-Israel Tension Impacting Indian Stock Market | Sakshi
Sakshi News home page

ఆటుపోట్లకే అధిక చాన్స్‌

Jun 16 2025 3:02 AM | Updated on Jun 16 2025 8:09 AM

Iran-Israel Tension Impacting Indian Stock Market

ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతల ఎఫెక్ట్‌ 

బీవోజే, ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీలపై కన్ను 

రుతుపవనాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు కీలకం 

దేశీ స్టాక్‌ మార్కెట్ల ట్రెండ్‌పై నిపుణుల అంచనాలు

అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లపై ప్రభావాన్ని చూపనున్నాయి. మరోపక్క ఫైనాన్షియల్‌ మార్కెట్లలో అత్యంత కీలకమైన బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్, ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్షలు చేపట్టనున్నాయి. దేశీయంగా చూస్తే రుతు పవన కదలికలు, టోకు ధరల గణాంకాలు ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం...     – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

అనూహ్యంగా ఆర్‌బీఐ రెపో రేటును 0.5 శాతం తగ్గించడంతో తొలుత జోరందుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు గత వారం చివర్లో డీలా పడ్డాయి. ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ భయాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ఈ వారం సైతం మార్కెట్లపై ప్రభావం పడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

మధ్యప్రాచ్యంలో ఆందోళనలు తలెత్తడంతో ఇప్పటికే ముడిచమురు ధరలు బలపడ్డాయి. వారాంతాన బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 78 డాలర్లను తాకగా.. పసిడికి డిమాండ్‌ పెరిగింది. విదేశీ మార్కెట్లో ఔన్స్‌ బంగారం 3450 డాలర్లను దాటేసింది. 3,500 డాలర్ల చరిత్రాత్మక గరిష్టంవైపు పరుగు తీస్తోంది. దీంతో ప్రధానంగా విదేశీ అంశాలు ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని అంచనా వేశారు. 

వడ్డీ రేట్లపై కన్ను 
బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ రేపు(17న) పాలసీ సమీక్షను చేపట్టనుంది. మే నెల సమావేశంలో స్వల్పకాలిక వడ్డీ రేటును 0.5 శాతంవద్దే కొనసాగించేందుకు నిర్ణయించింది. 2008 తదుపరి గరిష్ట స్థాయిలో వడ్డీ రేట్లు కదులుతున్నాయి. మరోవైపు యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సైతం బుధవారం(18న) పరపతి నిర్ణయాలు ప్రకటించనుంది. గత నెలలో చేపట్టిన సమీక్షలో ఫండ్స్‌ రేట్లను యథాతథంగా 4.25–4.5 శాతం వద్దే కొనసాగించేందుకు ఎఫ్‌వోఎంసీ నిర్ణయించింది.

వాణిజ్య సుంకాల నేపథ్యంలో తలెత్తిన గ్లోబల్‌ అనిశ్చితి, యూఎస్‌ ఆర్థిక మందగమనం, ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో రేట్ల కోతకు తొందరపడబోమని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ పేర్కొన్నారు. వెరసి అంతర్జాతీయంగా అత్యంత ప్రాముఖ్యత గల కేంద్ర బ్యాంకుల రేట్ల నిర్ణయాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్, ఆల్మండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ సేల్స్‌ హెడ్‌ కేతన్‌ వికమ్‌ తెలియజేశారు. 

గణాంకాల తీరు 
మే నెలకు చైనా పారిశ్రామిక ప్రగతి గణాంకాలు నేడు(16న) విడుదలకానున్నాయి. మార్చిలో నమోదైన 7.7 శాతం నుంచి ఏప్రిల్‌లో 6.1 శాతానికి తగ్గింది. ఏప్రిల్‌ రిటైల్‌ అమ్మకాలు 5.9 శాతం నుంచి 5.1 శాతానికి నీరసించాయి. యూఎస్‌ మే రిటైల్‌ అమ్మకాలు 17న వెల్లడికానున్నాయి. మార్చిలో నమోదైన 1.7 శాతం నుంచి తగ్గి ఏప్రిల్‌లో 0.1 శాతానికి పరిమితమయ్యాయి.

జపాన్‌ మే వాణిజ్య గణాంకాలు 18న వెల్లడికానున్నాయి. ఏప్రిల్‌లో వాణిజ్య లోటు 116 బిలియన్‌ జపనీస్‌ యెన్‌లకు దిగివచి్చంది. ఏప్రిల్‌లో జపాన్‌ ద్రవ్యోల్బణం 3.6 శాతంకాగా.. మే వివరాలు 20న తెలియనున్నాయి. దేశీయంగా మే టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) గణాంకాలు 16న వెలువడనున్నాయి. ఏప్రిల్‌లో డబ్ల్యూపీఐ 2.05 శాతం నుంచి వెనకడుగువేసి 0.85 శాతానికి పరిమితమైంది.  

ఇతర అంశాలు 
దేశీయంగా రుతుపవన కదలికలతోపాటు.. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, టోకు ధరలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా వివరించారు. ప్రపంచ మార్కెట్లలో నెలకొనే ట్రెండ్‌తోపాటు.. రంగాలవారీగా వెలువడే వార్తలు దేశీయంగా ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్విసెస్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు.  

గత వారమిలా...
ఆర్‌బీఐ లిక్విడిటీ పెంపు చర్యలు, గ్లోబల్‌ ఆందోళనల మధ్య గత వారం(9–13) దేశీ స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నికరంగా 1,070 పాయింట్లు(1.3 శాతం) క్షీణించి 81,119 వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 284 పాయింట్లు(1.1 శాతం) నీరసించి 24,719 వద్ద ముగిసింది. ఈ బాటలో బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ 1 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.1 శాతం స్థాయిలో వెనకడుగు వేశాయి.  

సాంకేతికంగా... 
సాంకేతికంగా చూస్తే ఈ వారం నిఫ్టీకి 24,600 పాయింట్ల వద్ద సపోర్ట్‌ కనిపించవచ్చు. ఈ స్థాయిని కోల్పోయి 24,500 దిగువకు చేరితే అమ్మకాలు ఊపందుకోవచ్చని అంచనా. 24,450 వద్ద మరోసారి మద్దతు లభించవచ్చు. ఎగువముఖంగా చూస్తే 25,350 వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే ఇండెక్స్‌ 25,600వరకూ బలపడవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement