
ముంబై : గ్రీన్ ఎనర్జీపై రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ చేసిన ప్రకటనపై మార్కెట్ వర్గాలు అంతగా ఆసక్తి కనబరచలేదు. దీంతో సాధారణ వార్షిక సమావేశం ముగిసిన తర్వాత రిలయన్స్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.
ప్రభావం లేదు
రాబోయే మూడేళ్లలో గ్రీన్ ఎనర్జీపై రూ. 75,000 కోట్ల పెట్టుబడులు పెడతామంటూ రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. జియో తరహాలోనే గ్రీన్ ఎనర్జీ మార్కెట్ రూపు రేఖలు మారుస్తామంటూ చెప్పారు. అయితే ఆ మాటలు పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో రిలయన్స్ షేర్ల ధరలో పెద్దగా మార్పు రాలేదు. సమాశం జరిగే రోజు కూడా శాతం మేర రిలయన్స్ షేర్లు విలువను కోల్పోయాయి. సమావేశానికి ముందు ముదుపరులు తమ వాటాలు అమ్మేందుకు ప్రయత్నించడంతో ఇలా జరిగింది. అయితే సమావేశం ముగిసిన తర్వాత కొంత మేరకు కోలుకుని రిలయన్స్ షేర్ విలువలో నష్టం 2.6 శాతానికే పరిమితమైంది.
మార్పులు
గ్రీన్ ఎనర్జీపై ప్రకటన వచ్చిన తర్వాత మార్కెట్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంత వ్యతిరేకత వ్యకత్మైన వెంటనే సమసిపోయింది. మొత్తంగా వేచి చూసే ధోరణి అవలంభించింది. పైగా ఈసారి రిలయన్స్ బోర్డులోకి కొత్త డైరెక్టర్ రావడం, గూగుల్ భాగస్వామ్యంతో కొత్త ఫోను, క్లౌడ్ స్టోరేజీ లాంటి ప్రకటనలను కూడా మార్కెట్ నిశితంగా గమనిస్తోంది. మరోవైపు ఫేస్బుక్, వాట్సప్లతో కలిసి ప్రారంభించిన జియోమార్ట్ ఫలితాలు అంత ఆశాజనకంగా లేవు. దీంతో మార్కెట్ స్తబ్థత నెలకొంది.