Intel India Head Nivruti Rai Resigns After Completing 29 Years - Sakshi
Sakshi News home page

29 ఏళ్ల తర్వాత.. ఇంటెల్ ఇండియా హెడ్ నివృతి రాయ్ రాజీనామా!

Published Sat, Jun 24 2023 6:26 PM

Intel India Head Nivruti Rai Resigns After Completing 29 Years - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం, అమెరికా చిప్‌ తయారీ సంస్థ ఇంటెల్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంటెల్ ఇండియా అధినేతగా, వివిధ హోదాల్లో 29 ఏళ్ల పాటు నిర్విరామంగా  సేవలందించిన నివృతి రాయ్ ఇంటెల్‌కు రాజీనామా చేశారు. త్వరలో, ‘ఇన్వెస్ట్‌ ఇండియా’ అధినేతగా బాధ్యతలు చేపట్టనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

కొంత కాలం క్రితం ఇన్వెస్ట్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్ట్‌గా కొనసాగుతున్న దీపక్‌ బగ్లా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానాన్ని రాయ్‌ భర్తీ చేయనున్నారు. ఇక రాయ్‌ రాజీనామాని ఇంటెల్‌ యాజమాన్యం ధృవీకరించింది. ‘రాయ్‌ నాయకత్వంలో ఇంటెల్‌ ఇండియా గణనీయమైన వృద్దిని సాధించిందని కొనియాడింది. ఆర్ధిక సేవల విభాగంలో చేరడంపై అభినందనలు తెలిపింది.

రాయ్‌ 1994లో అమెరికా ఇంటెల్‌లో డిజైన్ ఇంజినీర్‌గా తన కెరియర్‌ను ప్రారంభించారు. 2005లో భారత్‌కు తిరిగి వచ్చిన ఆమె ఆ సంస్థ చిప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఐపీ డెవెలప్‌మెంట్‌ గ్రూప్ సీనియర్‌ డైరెక్ట్‌గా బాధ్యతలు చేపట్టారు. వ్యాపార మెళుకువలు, అపారమైన అనుభవం కారణంగా  2016 నాటికి ఇంటెల్‌ ఇండియా అధినేత స్థాయికి చేరుకున్నారు. తాజాగా, ఇంటెల్‌కు రాజీనామా చేసి ఇన్వెస్ట్‌ ఇండియాలో చేరనున్నారు. 

నారీ శక్తి పురస్కారం..
ఇంటెల్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే.. 2021 నుంచి ఇంటెల్ ఇండియా స్కిల్‌ ట్రైనింగ్‌, రూరల్‌ కనెక్టివిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రీసెర్చ్‌ సెంటర్ల ఏర్పాటు కోసం ప్రయత్నాలను ప్రారంభించింది. ముఖ్యంగా, 20లక్షల మంది పిల్లలకు, 5,000 మంది ప్రభుత్వ ఉన్నతాధికారులకు స్కిల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాంను నిర్వహించింది.ప్రపంచ స్థాయిలో మహిళా వ్యవస్థాపకత, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన అత్యుత్తమ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమెకు నారీ శక్తి పురస్కారాన్ని అందజేశారు. 

రాజీనామా.. ఇంటెల్‌లో చర్చాంశనీయం
కోవిడ్‌-19తో ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెర‌గ‌డం.. వ‌ర్క్ ప్రం హోం.. లెర్నింగ్ ఫ్రం హోం సంస్కృతి అమ‌ల్లోకి వచ్చాయి. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొబైల్స్‌, ఆటోమొబైల్స్‌, ఎల‌క్ట్రానిక్స్ రంగాల్లో చిప్ కొర‌త నెల‌కొంది. చిప్‌లు, సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌త‌తో స్మార్ట్ ఫోన్ల లాంచింగ్‌, కార్ల ఆవిష్క‌ర‌ణ‌లు.. జాప్యం అవుతున్నాయి. కార్ల డెలివ‌రీ కూడా ఆల‌స్యం అవుతున్న‌ది. ఇలా ఆటోమొబైల్‌, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్‌ విభాగాలతో పాటు మొత్తం 169 రకాల పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు ఇంటెల్‌ లాంటి చిప్‌ తయారీ సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ తరుణంలో నివృతి రాయ్‌ ఇంటెల్‌ ఇండియాకు రాజీనామా చేయడం చర్చాంశనీయంగా మారింది. 

చదవండి👉 మోదీ ‘హై - టెక్‌ హ్యాండ్‌ షేక్‌’.. భారత్‌కు పెట్టుబడుల వరద!

Advertisement
Advertisement