దేశంలో 16.77 కోట్ల మంది విమానమెక్కారు.. | Indias domestic air passenger traffic grows 1 4pc to 1677 lakh in FY26 Report | Sakshi
Sakshi News home page

దేశంలో 16.77 కోట్ల మంది విమానమెక్కారు..

Apr 29 2026 8:18 AM | Updated on Apr 29 2026 8:20 AM

Indias domestic air passenger traffic grows 1 4pc to 1677 lakh in FY26 Report

ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య అంచనాలకు అనుగుణంగా పెరిగింది. రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా 0–3 శాతం అంచనా వేయగా 1.4 శాతం వృద్ధి నమోదైంది. 16.77 కోట్ల మంది ప్రయాణికులను దేశీ ఎయిర్‌లైన్స్‌ గమ్యస్థానాలకు చేర్చాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇది 16.54 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది మార్చిలో దేశీయంగా విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌ 1 శాతం పెరిగి 1.47 కోట్లుగా ఉంది.

మార్చిలో ప్యాసింజర్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ 89.5 శాతంగా ఉన్నట్లు, గతేడాది ఇదే వ్యవధిలో ఇది 86 శాతంగా ఉన్నట్లు ఇక్రా పేర్కొంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా విమాన ఇంధనం రేట్ల పెంపు భారం తక్కువగా ఉన్నట్లు వివరించింది. నెలవారీగా చూస్తే మార్చిలో క్రూడాయిల్‌ రేట్లు 45.5 శాతం పెరిగినా, ఏటీఎఫ్‌ ధరలపై కేంద్ర పౌర విమానయాన శాఖ 25 శాతం పరిమితి విధించినట్లు తెలిపింది.

దేశీయంగా ఏవియేషన్‌ రంగంపై ప్రభావం పడకుండా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు సీక్వెన్షియల్‌గా ఏప్రిల్‌లో ఏటీఎఫ్‌ రేట్లను 9.2 శాతం మాత్రమే పెంచాయి. అయితే, క్రూడాయిల్‌ ధరలు అధిక స్థాయిలోనే కొనసాగుతున్నందున భవిష్యత్తులో ఏటీఎఫ్‌ రేట్లపై ప్రభావం పడొచ్చని, డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుండటం మరో ఆందోళనకరమైన విషయమని ఇక్రా తెలిపింది.







 

Advertisement
 
Advertisement
Advertisement