ఈక్విటీ ఫండ్స్‌.. తగ్గేదేలే!  | Indian equity mutual fund inflows surged 56percent to Rs 40,450 crore | Sakshi
Sakshi News home page

ఈక్విటీ ఫండ్స్‌.. తగ్గేదేలే! 

Apr 11 2026 3:39 AM | Updated on Apr 11 2026 3:39 AM

Indian equity mutual fund inflows surged 56percent to Rs 40,450 crore

పశ్చిమాసియా యుద్ధం, మార్కెట్‌ ఆటుపోట్లలోనూ ఇన్వెస్టర్లు సై.. 

మార్చిలో రికార్డు స్థాయి పెట్టుబడులు; రూ.40,450 కోట్లు 

ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌కు ఆదరణ 

ఆల్‌టైమ్‌ గరిష్టానికి సిప్‌ పెట్టుబడులు 

డెట్‌ నుంచి భారీగా ఉపసంహరణలు

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ఆటుపోట్లు నెలకొన్న తరుణంలోనూ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడుల పట్ల తమ విశ్వాసాన్ని చాటారు. మార్చి నెలలో ఈక్విటీ ఫండ్స్‌లోకి రికార్డు స్థాయిలో రూ.40,456 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో వచ్చిన రూ.25,978 కోట్లతో పోల్చి చూస్తే 56 శాతం పెరిగాయి. 2025 జూలై (రూ.42,702 కోట్లు) తర్వాత ఒక నెలలో వచ్చిన అత్యధిక పెట్టుబడులు ఇవి. ముఖ్యంగా ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌కు అత్యధిక ఆదరణ లభించింది. 

మరోవైపు డెట్‌ ఫండ్స్‌ నుంచి భారీ స్థాయిలో రూ.2.95 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ఫిబ్రవరిలో ఇదే విభాగం రూ.42,106 కోట్లను ఆకర్షించడం గమనార్హం. మొత్తం మీద మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ మార్చిలో  రూ.2.4 లక్షల కోట్ల పెట్టుబడులను నికరంగా కోల్పోయింది. దీంతో మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని నికర ఆస్తుల (ఏయూఎం) విలువ ఫిబ్రవరి చివరికి ఉన్న రూ.82.03 లక్షల కోట్ల నుంచి మార్చి చివరికి రూ.73.73 లక్షల కోట్లకు తగ్గింది. ఇందులో ఈక్విటీ ఫండ్స్‌ రూ.31,97,698 కోట్లుగా ఉంది. స్టాక్స్‌ విలువలు తగ్గడం ఏయూఎంపై ప్రభావం చూపించింది.  

విభాగాల వారీగా.. 
→ అత్యధికంగా ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ రూ.10,054 కోట్ల పెట్టుబడులను మార్చి నెలలో ఆకర్షించాయి.  
→ స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.6,263 కోట్లు, మిడ్‌క్యాప్‌ లోకి రూ.6,063 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి.  
→ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ.5,307 కోట్లు, లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ.2,997 కోట్ల చొప్పున రాబట్టాయి. 
→ మల్టీక్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.2,981 కోట్లు రాగా, ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ రూ.437 కోట్లను కోల్పోయాయి.  
→ గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు భారీగా తగ్గి రూ.2,266 కోట్లకు పరిమితమయ్యాయి. ఫిబ్రవరిలో ఇదే విభాగంలోకి రూ.5,255 కోట్లు, జనవరిలో రూ.24,040 కోట్లు చొప్పున రావడం గమనార్హం.  
→ హైబ్రిడ్‌ ఫండ్స్‌ నుంచి నికరంగా రూ.16,500 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌ నుంచి రూ.21,000 కోట్లు బయటకు వెళితే, మల్టీ అసెట్‌ అలోకేషన్‌ ఫండ్స్‌లోకి రూ.5,000 కోట్లు వచ్చాయి.  

ఇన్వెస్టర్ల నమ్మకం.. 
‘మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టిపై ఇన్వెస్టర్లలో స్థిరమైన విశ్వాసం కొనసాగుతోందని మార్చి నెల పెట్టుబడులు తెలియజేస్తున్నాయి. భారత్‌ నిర్మాణాత్మక వృద్ధి బలంగా ఉండడంతో, ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను సర్దుబాటు చేసుకుంటున్నారు’ అని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) సీఈవో వెంకట్‌ చలసాని తెలిపారు.     

సిప్‌ సరికొత్త రికార్డు.. 
సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా ఈక్విటీల్లోకి నెలవారీ వచ్చే పెట్టుబడులు మార్చిలో ఆల్‌టైమ్‌ గరిష్ట రికార్డును నమోదు చేశాయి. రూ.32,087 కోట్ల పెట్టుబడులు సిప్‌ రూపంలో వచ్చాయి. ఫిబ్రవరిలో సిప్‌ పెట్టుబడులు రూ.29,845 కోట్లుగా ఉన్నాయి. దీర్ఘకాలం కోసం సిప్‌ రూపంలో వివిధ పథకాల్లో క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టే సంస్కృతి ఇటీవలి కాలంలో విస్తరిస్తున్నట్టు ఈ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement