జీసీసీ లీడర్‌.. హైదరాబాద్‌! | Hyderabad and Bengaluru dominate India Global Capability Centre leadership roles | Sakshi
Sakshi News home page

జీసీసీ లీడర్‌.. హైదరాబాద్‌!

Nov 6 2025 4:25 AM | Updated on Nov 6 2025 8:10 AM

Hyderabad and Bengaluru dominate India Global Capability Centre leadership roles

బెంగళూరుతో కలిపి 70 శాతం వాటా 

క్వెస్‌ కార్ప్‌ నివేదిక

ముంబై: గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ (జీసీసీ)కి సంబంధించి నాయకత్వ స్థాయి ఉద్యోగాలు ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరుల్లో ఉంటున్నాయి. ఈ తరహా కొలువుల్లో సుమారు 70 శాతం వాటా (ప్రతి 10 ఉద్యోగాల్లో 7) ఈ రెండు నగరాలదే ఉంటోంది. క్వెస్‌ కార్ప్‌ రూపొందించిన ’ఇండియా జీసీసీ–ఐటీ టాలెంట్‌ ట్రెండ్స్‌ 2025’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం వార్షికంగా హైదరాబాద్‌లో లీడర్‌షిప్‌ హోదాల్లో ఓపెనింగ్స్‌ 42 శాతం పెరిగాయి. పోటీ తీవ్రంగా ఉండటంతో వేతనాలు కూడా సాధారణం కంటే 6–8 శాతం ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటోంది. బెంగళూరులో మార్కెట్‌ సగటుకన్నా 8–10 శాతం అధికంగా వేతనాలు ఉంటున్నాయి. నివేదికలోని మరిన్ని కీలకాంశాలు.. 

→ ఫైనాన్స్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో చెన్నైలో అత్య ధిక కొలువులు ఉంటున్నాయి. రిటెన్షన్‌ స్థాయి (ఉద్యోగులను అట్టే పెట్టుకోవడం), ప్రథమ శ్రేణి నగరాలన్నింటితో పోలిస్తే అత్యధికంగా 94%గా ఉంది. అనలిటిక్స్, క్వాలిటీ అష్యూరెన్స్‌ విభాగాల్లో పుణే క్రమంగా పైకొస్తోంది. కోచి, కోయంబత్తూర్, అహ్మదాబాద్, ఇండోర్‌లాంటి చిన్న నగరాలూ క్రమంగా వృద్ధి చెందుతున్నాయి.  

→ కొత్త టెక్నాలజీల్లో నిపుణుల కొరత తీవ్రంగా ఉంటోంది. జనరేటివ్‌ ఏఐ, లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ విభాగాల్లో 50% అంతరం నెలకొంది. ఇక ఫిన్‌ఆప్స్‌ (ఫైనాన్షియల్‌ ఆపరేషన్స్‌), జీరో ట్రస్ట్‌ సెక్యూరిటీ, కుబెర్‌నెటిస్, టెరాఫామ్‌లాంటి వాటిల్లో 38–45 శాతం మేర నిపుణుల కొరత ఉంది. 

→ కీలక హోదాలను భర్తీ చేయడానికి కంపెనీలకు సగటున 3–4 నెలలు (90–120 రోజులు) పడుతోంది. అయితే, ఆఫర్లు అందుకున్నప్పటికీ 68–72 శాతం మంది మాత్రమే ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఇలా నిపుణుల కొరత నెలకొనడం వల్ల ప్రాజెక్టుల పురోగతి నెమ్మదిస్తోంది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్‌లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉంది.  

→ కొత్త కొలువుల్లో దాదాపు సగం వాటా ఏఐ, డేటా, ప్లాట్‌ఫాం, క్లౌడ్, సైబర్‌సెక్యూరిటీలాంటి విభాగాలదే ఉంటోంది. కంపెనీలు కేవలం ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడంపై కాకుండా సాధించే ఫలితాలను బట్టి ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement