‘రిచ్‌ డాడ్‌’ జీవితాన్ని మార్చిన భారతీయ గురువు | How Indian Guru Changed Rich Dad Poor Dad Robert Kiyosaki Life | Sakshi
Sakshi News home page

‘రిచ్‌ డాడ్‌’ జీవితాన్ని మార్చిన భారతీయ గురువు

Jul 2 2026 9:31 PM | Updated on Jul 2 2026 9:55 PM

How Indian Guru Changed Rich Dad Poor Dad Robert Kiyosaki Life

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చదివే వర్సనల్‌ ఫైనాన్స్‌ పుస్తకాలలో ఒకటైన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి తన ఆలోచనలతో చర్చనీయాంశంగా మారారు. డబ్బు సంపాదించడమే జీవిత పరమావధి కాదని, ప్రతి వ్యక్తి తన జీవితం అసలు ఉద్దేశాన్ని గుర్తించి దాని కోసం పనిచేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది.

కొన్నేళ్ల క్రితం ఓ భారతీయ గురువు చెప్పిన మాట తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని కియోసాకి వెల్లడించారు. "మీ శరీరం లక్ష్యం.. మీ ఆత్మ లక్ష్యాన్ని నెరవేర్చడమే" అనే ఆ బోధ అప్పట్లో తనకు పూర్తిగా అర్థం కాలేదని, ఆ సమయంలో తాను కేవలం డబ్బు సంపాదించడంలోనే నిమగ్నమై ఉన్నానని పేర్కొన్నారు. అయితే కాలక్రమేణా తన నిజమైన లక్ష్యం బోధించడమేనని గ్రహించినట్లు చెప్పారు.

విద్యార్థి దశలో చదువులో అంతగా రాణించకపోయినా, సాంప్రదాయ విద్యా విధానం తనకు నచ్చకపోయినా, ప్రజలకు ఆర్థిక విజ్ఞానాన్ని అందించడం తన జీవిత ధ్యేయంగా మారిందని కియోసాకి వివరించారు. పాఠశాలల్లో డబ్బు నిర్వహణ గురించి సరైన అవగాహన కల్పించడం లేదనే నమ్మకంతో ఐదు దశాబ్దాల క్రితమే తయారీ రంగాన్ని విడిచి, తన "రిచ్ డాడ్" నుంచి నేర్చుకున్న ఆర్థిక పాఠాలను ప్రజలకు బోధించడం ప్రారంభించానని చెప్పారు. అదే నిర్ణయం తన జీవితాన్ని మార్చిందని పేర్కొన్నారు.

చాలామంది జీవితమంతా ఉద్యోగం, సంపాదన, ఆర్థిక ఒత్తిళ్లలోనే గడిపేస్తున్నారని, అందువల్ల తమ అసలు జీవిత లక్ష్యాన్ని గుర్తించలేకపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. "మానవాళికి సేవ చేయడానికి నా హృదయం ఏమి చేయాలనుకుంటోంది?" అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాలని, ఫలితం లేదా డబ్బు గురించి ఆలోచించకుండా ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఆయన ప్రకారం, నిజమైన లక్ష్యంతో చేసే పని చివరికి ఆర్థిక విజయాన్నీ తీసుకువస్తుంది.

ప్రారంభంలో తాను ఉచితంగా ఆర్థిక విద్య అందించానని, "పొదుపుదారులు ఓడిపోతారు", "సరైన రుణం సంపదను సృష్టించగలదు" వంటి తన అభిప్రాయాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నానని కియోసాకి గుర్తు చేశారు. అయినప్పటికీ అదే ప్రయత్నం తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోట్ల డాలర్ల వ్యాపారంగా ఎదిగిందని తెలిపారు.

అమెరికా పౌరహక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మాటలను కూడా కియోసాకి ప్రస్తావించారు. విమర్శలు, వ్యతిరేకత ఎదురైనా తన లక్ష్యాన్ని వదిలిపెట్టని కింగ్‌ను ఉదాహరణగా చూపిస్తూ, చివరగా "మీ ఆత్మ అసలు లక్ష్యం ఏమిటి?" అంటూ తన ఫాలోవర్లకు ప్రశ్న వేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement