
ఢిల్లీ మార్కెట్లో రూ.98,900
రూ.1,000 తగ్గిన వెండి ధర
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారంతో.. సురక్షిత పెట్టుబడి సాధనమైన పసిడిలో లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. అమ్మకాల ఒత్తిడితో బంగారం 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) ఢిల్లీ మార్కెట్లో రూ.900 నష్టపోయి రూ.98,900 స్థాయికి దిగొచ్చింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.800 నష్టపోయి రూ.98,300 స్థాయిలో ట్రేడ్ అయ్యింది.
మరోవైపు వెండి సైతం కిలోకి రూ.1,000 నష్టపోయి రూ.1,04,200 స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం ఔన్స్కు 46 డాలర్లు క్షీణించి 3,323 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయ్యింది. ‘‘ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందంటూ యూఎస్ ప్రకటించడంతో బంగారం ధరలు ఒత్తిడి ని ఎదుర్కొన్నాయి. మరింత ఉద్రిక్తతలు పెరుగుతాయన్న అంచనాలు తగ్గడంతో ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించారు’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్విసెస్ సీఈవో చింతన్ మెహతా వివరించారు.