భారత్‌ స్టాక్స్‌లో పెట్టుబడులకు ప్రవాసుల ఆసక్తి | GCC NRIs shift investments from real estate to Indian stocks | Sakshi
Sakshi News home page

భారత్‌ స్టాక్స్‌లో పెట్టుబడులకు ప్రవాసుల ఆసక్తి

May 7 2026 5:37 AM | Updated on May 7 2026 5:37 AM

GCC NRIs shift investments from real estate to Indian stocks

27% రెమిటెన్స్‌లు సంపద సృష్టికే 

కుటుంబ అవసరాలకు 26 శాతం 

22 శాతం రిటైర్మెంట్‌ ప్రణాళికలకు ఈక్విరస్‌ వెల్త్‌ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: గల్ఫ్‌ దేశాల్లోని ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపిస్తున్న నిధుల్లో (రెమిటెన్స్‌లు) స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సంపాదనలో మిగులు నిధులను మాతృదేశానికి పంపడాన్ని ఒక తప్పనిసరి బాధ్యతగా వారి ఇప్పుడు చూడడం లేదు. వ్యూహాత్మకంగా సంపద సృష్టించుకోవాలన్న ప్రణాళికతో స్వదేశంలో పెట్టుబడులు పెడుతున్నారు. 

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఎన్‌ఆర్‌ఐలు పెట్టుబడుల దృష్టితో మాతృదేశానికి నిధులు పంపిస్తున్నట్టు ఈక్విరస్‌ వెల్త్‌ సర్వే నివేదిక వెల్లడించింది. గల్ఫ్‌ ప్రాంతంలోని (జీసీసీ) 8,300 మంది ఎన్‌ఆర్‌ఐల అభిప్రాయాల ఆధారంగా ఈక్విరస్‌ ఈ వివరాలు విడుదల చేసింది. దీని ప్రకారం.. గల్ఫ్‌ ప్రాంత ఎన్‌ఆర్‌ఐలకు సంపద సృష్టి కేంద్రంగా భారత్‌ స్థానం స్థిరపడుతోంది. అక్కడి వారు భారత్‌కు పంపిస్తున్న నిధుల్లో సగం పెట్టుబడులు, రిటైర్మెంట్‌ ప్రణాళికల కోసమే ఉంటున్నాయి.  

సర్వే అంశాలు.. 
→ జీసీసీ దేశాల ఎన్‌ఆర్‌ఐలు భారత్‌కు పంపిస్తున్న మొత్తం నిధుల్లో 27 శాతం పెట్టుబడుల కోసం ఉద్దేశించినవే. 
→ ఆ తర్వాత 22 శాతం రెమిటెన్స్‌లు రిటైర్మెంట్‌ ప్రణాళిక కోసం ఉంటున్నాయి.  
→ ఇక 26 శాతం మేర నిధులు భారత్‌లోని తమ కుటుంబాల జీవన అవసరాల కోసం పంపిస్తున్నారు.  
→ ప్రవాస భారతీయుల పెట్టుబడి ధోరణిలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో భూములు, ఇళ్ల కొనుగోలు పట్ల ఆసక్తి చూపించగా, ఇప్పుడు ఆర్థిక సాధనాల వైపు ఆకర్షితులవుతున్నారు. 
→ 40% మంది రియల్‌ ఎస్టేట్‌ (స్థిరాస్తి) నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. 
→ 73% మంది భారత స్టాక్‌ మార్కెట్లలో తమ పెట్టుబడులను క్రమంగా పెంచుకుంటున్నారు.  
→ 75% మంది దీర్ఘకాల చురుకైన ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. 

భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం 
ప్రాంతీయ అస్థిరతలు నెలకొన్నప్పటికీ, ప్రవాస భారతీయులు తమ పొదుపు మొత్తాలను పెంచుకోవడంపైనే దృష్టి పెట్టినట్టు ఈక్విరస్‌ వెల్త్‌ నివేదిక వెల్లడించింది. 83 శాతం మంది భౌగోళిక రాజకీయ పరిస్థితులు తమ ఆర్థిక నిర్ణయాలపై ప్రభావం చూపిస్తాయని అంగీకరించారు. ప్రాంతీయ అస్థిరతలపై 41 శాతం మంది ఆందోళన చెందుతుండగా.. 23 శాతం మంది ద్రవ్యోల్బణంపై, 13 శాతం మంది అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరతల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రకంగా గల్ఫ్‌ ప్రాంత ఎన్‌ఆర్‌ఐలకు ఉద్యోగ భద్రత, వీసా ప్రాధాన అంశాలుగా ఉంటుండగా.. ఇప్పుడు ఈ అంశాలపై కేవలం 12 శాతం మందే ఆందోళన చెందుతున్నారు. తమ ఆదాయ స్థిరత్వంపై వారిలో పెరిగిన నమ్మకాన్ని ఇది తెలియజేస్తున్నట్టు ఈక్విరస్‌ వెల్త్‌ నివేదిక పేర్కొంది.  

Advertisement
 
Advertisement
Advertisement