
లీజింగ్లో 62 శాతం వాటా
9 నగరాల అధ్యయనంలో వెల్లడి
సీబీఆర్ఈ నివేదిక
న్యూఢిల్లీ: ఆఫీస్ స్పేస్ లీజింగ్లో గ్లోబల్ కార్పొరేట్ల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య కాలంలో విదేశీ సంస్థలు తొమ్మిది నగరాలవ్యాప్తంగా 111.60 లక్షల చ.అ. స్పేస్ను లీజుకు తీసుకున్నాయి. మార్చి క్వార్టర్లో నమోదైన 180 లక్షల చ.అ. స్థలంలో ఇది సుమారు 62 శాతం. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం గతేడాది ఇదే వ్యవధిలో 171 లక్షల చ.అ. లీజింగ్ నమోదైంది. హైదరాబాద్తో పాటు ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, కొచ్చి నగరాల్లో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇటు దేశీ, అటు అంతర్జాతీయ సంస్థలు వ్యాపారాన్ని విస్తరిస్తుండటంతో లీజింగ్ కార్యకలాపాలు మరింతగా పుంజుకునే అవకాశం ఉందని సీబీఆర్ఈ చైర్మన్ (ఇండియా, ఆగ్నేయాసియా) అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టితో కంపెనీలు నాణ్యమైన ఆఫీస్ స్పేస్లను కోరుకుంటున్నందున, పర్యావరణహిత కార్యాలయాలకు డిమాండ్ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
జీసీసీలకు డిమాండ్..
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటు కూడా ఆఫీస్ స్పేస్కు దన్నుగా ఉంటోందని అన్షుమన్ తెలిపారు. కొత్త ఆవిష్కరణలు, డిజిటల్ పరివర్తన కోసం బహుళజాతి సంస్థలు స్థానికంగా నిపుణుల సేవలను వినియోగించుకోవడంపై ఆసక్తి కనపరుస్తుండటంతో జీసీసీలకు భారత్ చాలా వేగంగా గ్లోబల్ హబ్గా ఎదుగుతోందని సీబీఆర్ఈ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రామ్ చంద్నానీ తెలిపారు. 2025లో మొత్తం ఆఫీస్ స్పేస్లో జీసీసీల వాటా సుమారు 35–40 శాతానికి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, వివిధ రాష్ట్రాల్లో సానుకూల విధానాల కారణంగా చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తున్నాయని వివరించారు. జీసీసీల విషయంలో అమెరికన్ కంపెనీలదే ఆధిపత్యం ఉన్నప్పటికీ, యూరప్, ఆసియా కంపెనీలు కూడా ఇక్కడ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుపై ఆసక్తి చూపుతున్నాయని రామ్ చంద్నానీ చెప్పారు. నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణమని పేర్కొ న్నారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ), టెక్నాలజీ రంగాల నుంచి ఇకపైనా డిమాండ్ గణనీయంగా కొనసాగుతుందని వివరించారు.
తగ్గిన కో–వర్కింగ్ స్పేస్..
జనవరి–మార్చి త్రైమాసికంలో కో–వర్కింగ్ ఆపరేటర్లు.. ఆఫీస్ స్పేస్ను లీజుకు తీసుకోవడం 43 శాతం తగ్గింది. తొమ్మిది ప్రధాన నగరాల్లో ఇది 21.6 లక్షల చ.అ.లకు పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో కో–వర్కింగ్ ఆపరేటర్లు 37.6 లక్షల చ.అ. స్పేస్ను లీజుకు తీసుకున్నారు. కో–వర్కింగ్ సంస్థలు, ప్రాపర్టీ ఓనర్ల దగ్గర్నుంచి ఆఫీస్ స్పేస్ను అద్దెకు తీసుకుని, దాన్ని క్లయింట్లకు సబ్–లీజుకు ఇస్తుంటాయి. ఉయ్వర్క్ ఇండియా, స్మార్ట్వర్క్స్, ఇన్క్యుస్పేజ్, సింప్లీవర్క్ ఆఫీసెస్, ఇండిక్యూబ్, లిస్టెడ్ సంస్థ ఆఫీస్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. కోవిడ్ అనంతరం కో–వర్కింగ్ వర్క్స్పేస్కు డిమాండ్ గణనీయంగా పెరిగింది.