విధానాల రూపకల్పనకు క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ
దేశవ్యాప్తంగా పరిశ్రమల సందర్శనకు ఆర్థిక శాఖ కసరత్తు
న్యూఢిల్లీ: ఆర్థిక విధానాలు .. బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనకు, పశ్చిమాసియా సంక్షోభంపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకోతగిన చర్యల గురించి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీలు, పరిశ్రమ క్లస్టర్లను సందర్శించడంపై కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక వ్యవహారాల విభాగం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
దీని ప్రకారం ఆర్థిక శాఖలోని అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి లేదా డైరెక్టర్ సారథ్యంలో అయిదుగురు వరకు సభ్యులతో బృందాలను ఏర్పాటు చేస్తారు. ఈ బృందాలు భారీ, మధ్య, చిన్న తరహా తయారీ యూనిట్లను సందర్శిస్తాయి. వివిధ రంగాలవ్యాప్తంగా విధానాలు, నిర్వహణపరమైన సవాళ్లను పరిశీలిస్తాయి. మౌలిక సదుపాయాలు, రెగ్యులేటరీ అవరోధాలు, సరఫరా వ్యవస్థలో అవాంతరాలు, నిధుల లభ్యతపరమైన సవాళ్లు, నైపుణ్యాల్లో కొరత, సాంకేతికత వినియోగం మొదలైన అంశాలు వ్యాపారాలపై చూపుతున్న ప్రభావాల గురించి నేరుగా తెలుసుకుంటాయి.
ఒక్కో విడతలో కనీసం రెండు స్టార్టప్లతో పాటు తయారీ, ఇన్ఫ్రా, పరిశోధనలు తదితర రంగాల సంస్థలను సందర్శించి, పరిస్థితుల గురించి బృంద సభ్యులు తెలుసుకుంటారు. కొన్ని రంగాలపై ప్రభుత్వం గణనీయంగా వ్యయం చేస్తున్నప్పటికీ, వివిధ కారణాలరీత్యా ప్రైవేట్ పెట్టుబడులు ఇంకా పుంజుకోవడం లేదు. పశి్చమాసియా సంక్షోభం వల్ల రూపాయి బలహీనపడటం, క్రూడాయిల్ రేట్లు పెరగడం తదితర సవాళ్లు వీటికి తోడయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ కసరత్తు ప్రాధాన్యం సంతరించుకుంది.


