ఎకానమీటాక్
→ పశ్చిమాసియా సంక్షోభానికి ఇప్పుడప్పుడే తెరపడేలా లేదు. ఉద్రిక్తతలు మరింత ముదిరితే ముడి చమురు రేటు ఇప్పుడున్న 100 డాలర్ల స్థాయి నుంచి 140 డాలర్లకు ఎగబాకే ప్రమాదం ఉంది. బహుశా జూన్లోనే ఇది జరగవచ్చు.
→ దీనివల్ల భారత్ ఎకానమీపై తీవ్ర ప్రభావం తప్పదు. ముఖ్యంగా పెట్రో ధరలు మరింత ఎగబాకుతాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. మరోపక్క వృద్ధి మందగిస్తుంది. అయితే, ఈ సమస్య ఒక్క భారత్కే పరిమితం కాదు, ప్రపంచమంతా ఎదుర్కొంటున్నదే. వాస్తవానికి మన ఎకానమీ కాస్త మెరుగైన స్థితిలోనే ఉంది.
→ ప్రస్తుతం అధిక చమురు ధరల కంటే సరఫరాపరమైన అడ్డంకుల వల్లే భారత్కు అధిక నష్టం వాటిల్లుతోంది. క్రూడ్ ఒక్కటే కాదు, వంట గ్యాస్, ఎల్ఎన్జీ, ఎరువులు ఇలా అన్నింటికీ సప్లై షాక్ తగులుతోంది. ఒకవేళ పశ్చిమాసియా ఉద్రిక్తతలు త్వరలో శాంతించినప్పటికీ, సరఫరా వ్యవస్థ కుదుటపడేందుకు రెండు మూడు నెలలు పడుతుంది.
→ క్రూడ్ సెగతో ప్రభుత్వం పెట్రో ధరలను మరింత పెంచాల్సి వస్తుంది. రవాణా, తయారీ వ్యయాలు దూసుకెళ్తాయి. రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. రూపాయి మరింత బలహీనపడుతుంది.
→ డాలరుతో రూపాయి మారకం విలువ 100 స్థాయికి పడిపోతుండటంపై మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఒక సైకలాజికల్ నంబర్ మాత్రమే. ఎందుకంటే, కొన్ని అనవసర దిగుమతులను తగ్గించుకోవడం ద్వారా సర్దుబాటు చేసుకోవడానికి వీలుంది.
→ క్రూడ్ షాక్సహా భౌగోళిక రాజకీయ అనిశ్చితులను తట్టుకునేందుకు భారత్ వద్ద తగినన్ని విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు (దాదాపు 700 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. అధిక దిగుమతుల బిల్లు వల్ల ఇవేమీ తరిగిపోవు, ఒకవేళ ఆర్బీఐ రూపాయి పతనాన్ని (తాజాగా 96.95ని తాకింది) అడ్డుకోవడం కోసం ఉపయోగిస్తేనే అవి వేగంగా కరిగిపోయే అవకాశం ఉంటుంది.
→ కాబట్టి, రూపాయికి దన్నుగా నిలిచేందుకు ఆర్బీఐ ఎట్టిపరిస్థితుల్లోనూ ఫారెక్స్ నిల్వలను వాడకూడదు. ఎగుమతులకు మద్దతివ్వాలంటే కరెన్సీ విలువను మార్కెట్ వర్గాలే నిర్ణయించేలా చూడాలి.
→ పశ్చిమాసియా సంక్షోభం తీవ్రమైతే ఆర్థికంగా బలహీన వర్గాలు, చిన్న వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలి. నగదు బదిలీలను మరింత పెంచడం, చిన్న సంస్థలకు మరిన్ని రుణాలివ్వడం, నగదు సరఫరా పెంపు ద్వారా మద్దతివ్వాలి.
– గీతా గొపీనాథ్, హార్వర్డ్ యూనివర్సిటీ ఆర్థికవేత్త, ఐఎంఎఫ్ మాజీ డిప్యూటీ ఎండీ


