రత్నాభరణాల ఎగుమతుల రంగం ఏప్రిల్లో ప్రతికూలతలను చవిచూసింది. పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో ఎగుమతులు ఢీలా పడ్డాయి. క్రితం ఏడాది ఏప్రిల్తో పోల్చి చూసినప్పుడు ఎగుమతులు 9 శాతం తగ్గి 2,226 మిలియన్ డాలర్లకు (రూ.20,825 కోట్లు సుమారు) పరిమితమయ్యాయి. ఈ వివరాలను రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) వెల్లడించింది. క్రితం ఏడాది ఏప్రిల్లో ఎగుమతులు 2,448 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం.
ఏప్రిల్లో కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 19.65 శాతం తగ్గి 890.91 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ల్యాబ్లో తయారు చేసిన వజ్రాల ఎగుమతులు సైతం 15 శాతానికి పైనే క్షీణించి 93.28 మిలియన్ డాలర్లకు చేరాయి.
బంగారం ఆభరణాల ఎగుమతులు ఏకంగా 21.77 శాతం తగ్గి 841.54 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
సాధారణ బంగారం ఆభరణాల ఎగుమతులు 342 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఏప్రిల్తో పోల్చితే 47 శాతం తక్కువ.
స్టడెడ్ (రాళ్లు పొదిగిన) బంగారం ఆభరణాల ఎగుమతులు మాత్రం 16 శాతం వృద్ధి చెంది 500 మిలియన్ డాలర్లకు చేరాయి.
ఇక వెండి ఆభరణాల ఎగుమతులు ఏకంగా 444 శాతం ఎగసి 268 మిలియన్ డాలర్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే నెలలో వీటి ఎగుమతులు 49 మిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం.


