
ముంబై: ఇండెక్స్ డెరివేటివ్స్లో ఎక్స్పైరీ రోజున మితిమీరిన ట్రేడింగ్ కట్టడికే నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్టైమ్ సభ్యుడు అనంత నారాయణ్ తెలిపారు. డెరివేటివ్స్ ట్రేడింగ్లో రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారని అధ్యయనంలో తేలిన మీదట గతేడాది అక్టోబర్లో చర్యలు ప్రకటించినట్లు ఆయన చెప్పారు.
కనీస కాంట్రాక్టు పరిమాణాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 30 లక్షలకు దశలవారీగా పెంచడం, ప్రీమియంను ముందుగా వసూలు చేయడం తదితర చర్యలను సెబీ ప్రకటించింది. ముందుగా క్యాష్ మార్కెట్ను అభివృద్ధి చేసి, ఆ తర్వాత డెరివేటివ్స్పై కసరత్తు చేయాలని స్టాక్ ఎక్స్చేంజీలకు సూచించారు. మరోవైపు, పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివరాలను సెబీ బోర్డు సభ్యులందరూ ప్రజలకు వెల్లడించడాన్ని తప్పనిసరి చేసేలా నిబంధనలను రూపొందిస్తామని సెబీ కొత్త చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు.
విశ్వసనీయతను, పారదర్శకతను పెంపొందించడానికి ఇది ఉపయోగపడగలదని ఆయన వివరించారు. ఓవైపు నియంత్రణ సంస్థ అధిపతిగా, మరోవైపు నియంత్రిత సంస్థల్లో భాగస్వామిగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోసం పని చేశారంటూ సెబీ మాజీ చీఫ్ మాధవి పురి బుచ్పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాండే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెబీ విచారణ ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ సంస్థ సహ–ఇన్వెస్టరుగా ఉన్న ఫండ్లో ఆమె పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.