డీజిల్పై వ్యాట్ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ఉత్పత్తుల ధరలు చుక్కలను తాకుతుంటే ప్రజలకు ఊరట కల్పించేందుకు ఢిల్లీ కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్పై వ్యాట్ను 30 శాతం నుంచి 16.75 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. దీంతో దేశ రాజధానిలో డీజిల్ ధరలు లీటర్కు 8.36 రూపాయలు తగ్గి 82 రూపాయల నుంచి 73 రూపాయలకు దిగివచ్చాయి. డీజిల్ ధరలు దిగిరానుండటంతో ఢిల్లీ ఆర్థిక వ్యవస్ధలో ఉత్తేజం నెలకొనేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని కేబినెట్ సమవేశానికి అధ్యక్షత వహించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సవాల్తో కూడుకున్నదని, ప్రజల సహకారంతో దీన్ని సాధిస్తామని స్పష్టం చేశారు. డీజిల్ ధరను తగ్గించాలని కొంతకాలంగా నగర వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు డిమాండ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. డీజిల్పై వ్యాట్ తగ్గించడంతో దేశంలోనే డీజిల్ ధర తక్కువగా ఉన్న రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. రాజస్ధాన్లో అత్యధికంగా డీజిల్ లీటర్కు 82 రూపాయలు ఉండగా, మధ్యప్రదేశ్లో 81.29 రూపాయలు, మహారాష్ట్రలో 79.81 రూపాయలు పలుకుతోంది. గుజరాత్లో లీటర్ డీజిల్ 79 రూపాయలుగా ఉంది. చదవండి : పెట్రోల్తో డీజిల్ ధర సమానం! ఎందుకు?