కరోనా కాలంలోనూ కరెంట్‌ ఖాతా మిగులు | Current Account Surplus For First Time in 17 Years in FY21 | Sakshi
Sakshi News home page

కరోనా కాలంలోనూ కరెంట్‌ ఖాతా మిగులు

Jul 1 2021 9:01 PM | Updated on Jul 1 2021 10:23 PM

Current Account Surplus For First Time in 17 Years in FY21 - Sakshi

ముంబై: దేశం కరోనా సవాళ్లను ఎదుర్కొన్న 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 0.9 శాతం (స్థూల దేశీయోత్పత్తి విలువలో) కరెంట్‌ అకౌంట్‌ మిగులును నమోదు చేసుకుందని ఆర్‌బీఐ బుధవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. విలువలో ఇది 102.2 బిలియన్‌ డాలర్లు(7,62,616.4 కోట్లు). గత 17 ఏళ్లలో మొదటిసారి ఎఫ్‌వై 21లో కరెంట్ అకౌంట్ మిగులు సాధించింది. ఒక దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్‌ అకౌంట్‌’ ప్రతిబింబిస్తుంది.

వచ్చిన దానికన్నా చెల్లింపులు అధికంగా ఉండే పరిస్థితి ‘కరెంట్‌ అకౌంట్‌ లోటు’. చెల్లింపులకన్నా దేశంలోకి వచ్చిన మొత్తాలు అధికంగా ఉంటే అది కరెంట్‌ అకౌంట్‌ మిగులు. ఇక 2019-20లో 0.9 శాతం కరెంట్‌ అకౌంట్‌ లోటును నమోదుచేసుకుంది. విలువలో ఇది 157.5 బిలియన్‌ డాలర్లు. గణాంకాల ప్రకారం.. 

  • దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 44 బిలియన్‌ డాలర్లు. 2019-20లో ఈ పరిమాణం 43 బిలియన్‌ డాలర్లే కావడం గమనార్హం.  
  • నికర విదేశీ ఫోర్ట్‌ఫోలియో పెట్టుబడులు కూడా ఇదే కాలంలో 1.4 బిలియన్‌ డాలర్ల నుంచి 36.1 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. 
  • మహమ్మారి ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్‌ కార్పొరేట్ల విదేశీ వాణిజ్య రుణాలు మాత్రం 21.7 బిలియన్‌ డాలర్ల నుంచి 0.2 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. 
  • విదేశీ మారకద్రవ్య నిల్వలకు అదనంగా మరో 87.3 బిలియన్‌ డాలర్లు తోడయ్యాయి. ప్రస్తుత విలువ దాదాపు 600 బిలియన్‌డాలర్ల పైన రికార్డు స్థాయిల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 
  • కాగా ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్న నేపథ్యంలో 2020-21లో కరెంట్‌ అకౌంట్‌ ‘లోటు’లోనే ఉంటుందని అంచనా.

చదవండి: ఎంఐ 12 స్మార్ట్‌ఫోన్‌లో రాబోయే ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు

Advertisement
 
Advertisement
Advertisement