అపార్ట్‌మెంట్‌ ధరలకు రెక్కలు | Apartment Prices Surge Across India Top Cities as Premium Homes Drive Demand | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్‌ ధరలకు రెక్కలు

May 1 2026 8:09 AM | Updated on May 1 2026 8:28 AM

Apartment Prices Surge Across India Top Cities as Premium Homes Drive Demand

ప్రధాన నగరాల్లో 8–20% పెరుగుదల

మార్చి త్రైమాసికంపై జేఎల్‌ఎల్‌ నివేదిక 

దేశంలోని ప్రముఖ నగరాల్లో అపార్ట్‌మెంట్ల ధరలు 8–20 శాతం మధ్య మార్చి త్రైమాసికంలో పెరిగాయి. నిర్మాణంలోకి వినియోగించే మెటీరియల్స్‌ ధరలు పెరిగిపోవడం ఇందుకు దారితీసినట్టు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది. అంతర్గతంగా డిమాండ్‌ కూడా బలంగా ఉండడం, భూముల ధరలు, నిర్మాణవ్యయాలు పెరుగుదల, ప్రీమియం ఇళ్ల వైపు మొగ్గు చూపించడం కూడా ధరల పెరుగుదలకు కారణాలుగా పేర్కొంది.

ఈ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. మార్చి త్రైమాసికంలో హైదరాబాద్‌ సహా టాప్‌–7 నగరాల్లో 70,631 యూనిట్ల అపార్ట్‌మెంట్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 65,222 యూనిట్లుగా ఉన్నాయి. కొత్త  సరఫరా (నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రావడం) 13 శాతం పెరిగింది. 90,023 యూనిట్ల కొత్త అపార్ట్‌మెంట్లు (ఫ్లాట్లు) అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, పుణె, చెన్నై, కోల్‌కతా నగరాల డేటా ఆధారంగా ఈ వివరాలను జేఎల్‌ఎల్‌ ఇండియా విడుదల చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లు, వ్యయాల ఒత్తిళ్లను పరిగణనలోకి తీసుకుని చూస్తే.. ఇళ్ల ధరలు ఇక ముందూ పెరగొచ్చని, కాకపోతే ఈ పెరుగుదల కాస్త నిదానించొచ్చని అంచనా వేసింది.  

ప్రీమియం ఫ్లాట్లకు పటిష్ట డిమాండ్‌

అందుబాటు ధరల ఇళ్లకు డిమాండ్‌ పడిపోగా, ప్రీమియం ఇళ్లకు మాత్రం పటిష్టంగా కొనసాగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రూ.50 లక్షల్లోపు అపార్ట్‌మెంట్ల విక్రయాలు మార్చి త్రైమాసికంలో 24 శాతం తగ్గి 20,269 యూనిట్లకు పరిమితమయ్యాయి. రూ.కోటికి పైగా ధరల శ్రేణిలోని అపార్ట్‌మెంట్ల అమ్మకాలు మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 30 శాతం పెరిగి 50,362 యూనిట్లకు చేరాయి. ‘‘కొనుగోలుదారుల సెంటిమెంట్‌ ఆధారంగా కొత్త సరఫరా వస్తోంది. కొత్త ప్రాజెక్టుల ఆరంభం 13 శాతం పెరగడం, విక్రయాల్లో 8 శాతం వృద్ధి అన్నవి ఆర్థిక అనిశ్చితుల్లో కస్టమర్లు అప్రమ్తత ధోరణితో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది’’ అని జేఎల్‌ఎల్‌ సీనియర్‌ ఎండీ శివ కృష్ణన్‌ తెలిపారు.

ఇదీ చదవండి: 2032 వరకు అన్ని హక్కులు మావే

Advertisement
 
Advertisement
Advertisement