కొన్ని నగరాలకే పరిమితమైన టెక్నాలజీ
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం తక్కువే
ఓపెన్ఏఐ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: కోడింగ్, డేటా అనాలిసిస్, సంక్లిష్టమైన రీజనింగ్లాంటి అంశాల్లో భారత్ ప్రపంచంలోనే అధునాతన ఏఐ మార్కెట్లలో ఒకటిగా ఉంటోందని ఓపెన్ ఏఐ ఒక నివేదికలో తెలిపింది. సంక్లిష్టమైన సవాళ్లను పరిష్కరించేందుకు, అడ్వాన్స్డ్ స్థాయిలో ఏఐని తరచుగా యూజర్లు వినియోగించుకోవడంలో టాప్ అయిదు దేశాల్లో భారత్ ఒకటిగా ఉంటోందని పేర్కొంది. అయితే, కృత్రిమ మేథ వినియోగం కొన్ని నగరాలకే పరిమితమవుతోందని, గ్రామీణ.. పట్టణ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటోందని వివరించింది.
సాటి దేశాలతో పోల్చి చూసినప్పుడు, భారత్లో మిగతా ప్రాంతాల కన్నా టాప్ నగరాల్లో ఏఐ వినియోగం 3 రెట్లు అధికంగా ఉంటోందని ఓపెన్ఏఐ తెలిపింది. రిపోర్ట్ ప్రకారం కోడింగ్, డేటా అనలిటిక్స్ వినియోగంలో కూడా భారత్కి పటిష్టమైన ర్యాంకింగ్ ఉంది. 2026 ఫిబ్రవరిలో ఓపెన్ఏఐ కోడెక్స్ (కోడింగ్ టూల్) యాప్ను ఆవిష్కరించిన రెండు వారాల్లోనే దీని యూజర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. అయితే, ఈ వినియోగం అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా, ఒకే రకంగా లేదు. అడ్వాన్స్డ్ ఏఐ వినియోగంలో భారీగా అంతరాలు ఉంటున్నాయి.
మరిన్ని విశేషాలు..
→ మొత్తం ఏఐ యూజర్లలో 50 శాతం మంది టాప్ 10 నగరాల్లో ఉంటున్నారు, ఢిల్లీ ఎన్సీఆర్ అగ్రస్థానంలో ఉంది. అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, జర్మనీలాంటి సాటి దేశాలతో పోలిస్తే దేశీయంగా టాప్ నగరాల్లో ఏఐ వినియోగం 3 రెట్లు ఎక్కువగా ఉంటోంది. దేశ జనాభాలో ఈ నగరాల్లో నివసించే వారి సంఖ్య 10 శాతం లోపే ఉంటుంది.
→ అడ్వాన్స్డ్ ఏఐ వినియోగం విషయానికొస్తే అంతరం మరింత ఎక్కువగా ఉంటోంది. వెనుకబడిన నగరాలతో పోలిస్తే టాప్ సిటీల్లో డేటా అనాలిసిస్ వినియోగం 30 రెట్ల వరకు, కోడింగ్ వినియోగం 4 రెట్లు, ఏఐ డెవలపర్ (కోడెక్స్) వినియోగం 9 రెట్లు అధికంగా ఉంది.
→ పోటీ దేశాలతో పోలిస్తే భారత్కి ఏఐ సామర్థ్యాలు గణనీయంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్, బెంగళూరు,, ఢిల్లీ, చెన్నైలాంటి కొన్ని పట్టణ ప్రాంత హబ్లలో మాత్రమే అవి కేంద్రీకృతమై ఉంటున్నాయి.
→ విద్య, ఆరోగ్యంలాంటి రంగాల్లో అత్యంత అర్థవంతమైన విధంగా ఏఐ వినియోగం పెరుగుతోంది. విద్య విషయంలో తూర్పు రాష్ట్రాలు ముందుంటున్నాయి. విద్యాభ్యాసానికి సంబంధించిన మొత్తం మెసేజీలు జాతీయ సగటైన 20 శాతానికి మించి అస్సాంలో 22 శాతం స్థాయిలో ఉంటున్నాయి. ఒరిస్సా, మణిపూర్, త్రిపుర, చత్తీస్గఢ్లలో కూడా దాదాపు ఇదే ధోరణి ఉంది. ఆరోగ్యం విషయంలో జమ్మూ కాశీ్మర్, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, కేరళలాంటి ప్రాంతాల్లో ఏఐ వినియోగం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ప్రతి 10 మెసేజీల్లో ఒకటి ఆరోగ్యానికి సంబంధించినది ఉంటోంది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది 32 శాతం అధికం.
→ టెక్నాలజీ వినియోగ సామర్థ్యాలు ఎంత విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయనే దానిపై భారతదేశపు తదుపరి దశ ఏఐ ప్రస్థానం ఆధారపడి ఉంటుంది. తొలినాటి వినియోగదారుల పరిధిని దాటి ఏఐ ప్రయోజనాలు ఎంత వేగంగా మరింత భారీ స్థాయిలో జనాభాకు అందుబాటులోకి వస్తాయనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ అంతరాలను భర్తీ చేయాలంటే నైపుణ్యాలను పెంపొందించడం, అర్థవంతమైన విధంగా ఉపయోగించుకునేందుకు తోడ్పాటు అందించడం కీలకంగా ఉండనున్నాయి.


