ఉత్పాదకతను పెంచడంలో, మానవ శ్రమను తగ్గించడంలో కృత్రిమ మేధ (ఏఐ) చాలా ఉపయోగపడుతోందన్న మాట వాస్తవమే. అందుకే ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు ఏఐ సాధనాలను అందిస్తూ వచ్చాయి. అయితే, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. అపరిమిత ఉత్పాదకతను ఆశ చూపిన ఏఐ, ఇప్పుడు కంపెనీల బడ్జెట్లకు తూట్లు పొడుస్తోంది. దీంతో మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఉబెర్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాల దారిలోనే.. ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ నెట్వర్క్ అయిన వాల్మార్ట్ కూడా తమ ఉద్యోగుల ఏఐ వినియోగంపై ఆంక్షలు విధిస్తుంది.
‘కోడ్ పప్పీ’కి బ్రేకులు
బ్లూమ్బెర్గ్ తాజా నివేదిక ప్రకారం.. వాల్మార్ట్ తన అంతర్గత కార్పొరేట్ పనుల కోసం రూపొందించుకున్న ‘కోడ్ పప్పీ’ అనే ఏఐ అసిస్టెంట్ వినియోగంపై పరిమితులు విధించింది. ఇది ఉద్యోగులకు ప్రెజెంటేషన్లు తయారు చేయడం, డేటా స్ప్రెడ్షీట్లను నింపడం వంటి రోజువారీ పనులను చిటికెలో చేసిపెట్టే ఏఐ ఏజెంట్. గతంలో వాల్మార్ట్ ఉద్యోగులు దీనిని అపరిమితంగా వాడేవారు. ఉద్యోగుల నుంచి దీనికి డిమాండ్ పెరగడంతో కంపెనీకి బిల్లులు తడిసి మోపెడయ్యాయి. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం ఇకపై ఉద్యోగులకు టోకెన్ పరిమితి విధించాలని నిర్ణయించింది.
టోకెన్ పరిమతి అంటే ఏమిటి?
ఏఐ భాషలో టోకెన్ అనేది ఒక కొలమానం. మనం ఏఐకి ఇచ్చే ప్రాంప్ట్లు (ప్రశ్నలు) అది ఇచ్చే సమాధానాల పొడవును బట్టి టోకెన్లు ఖర్చవుతాయి. ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ టోకెన్లు వినియోగమవుతాయి. అంటే.. ఇకపై వాల్మార్ట్ ఉద్యోగులు లెక్క చూసుకుని మరీ ఏఐని వాడాల్సి ఉంటుంది.
ఈ విషయంపై వాల్మార్ట్ ప్రతినిధి స్పందిస్తూ.. ఉద్యోగులు ఏఐని కేవలం కాలక్షేపానికి కాకుండా కంపెనీకి విలువను చేకూర్చే పనులకు మాత్రమే వాడాలని, సరైన పని కోసం సరైన ఏఐ సాధనాన్ని ఎంచుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం వాల్మార్ట్ సిబ్బందికి కోడ్ పప్పీతో పాటు క్లాడ్, చాట్జీపీటీ వంటి ఇతర సాధనాల యాక్సెస్ కూడా ఉంది.
ఉబెర్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకూ తప్పని తిప్పలు
ఖర్చులు పెరుగిపోతున్న ఉదంతాన్ని బహిరంగంగా అంగీకరించిన సంస్థల్లో రైడ్-హెయిలింగ్ దిగ్గజం ఉబెర్ ముందు వరుసలో ఉంది. ఈ ఏడాది జనవరిలో ఉబెర్ తన 5,000 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ‘క్లాడ్ కోడ్’ యాక్సెస్ ఇచ్చింది. అయితే, కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఆ ఏడాది మొత్తానికి కేటాయించిన ఏఐ బడ్జెట్ అంతా ఖర్చయిపోవడంతో యాజమాన్యం నివ్వెరపోయింది.
మైక్రోసాఫ్ట్ యూటర్న్: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం తన అంతర్గత ఇంజినీర్లను క్లాడ్ కోడ్ వాడకం తగ్గించి, జూన్ 30 లోగా సంస్థకు చెందిన సొంత ఏఐ టూల్స్కు మారిపోవాలని ఆదేశించింది. టోకెన్ ఖర్చులు మితిమీరడమే దీనికి ప్రధాన కారణమని సమాచారం.
ఇదీ చదవండి: నిన్నటి ధరే నేడు.. ప్రశాంతంగా పసిడి


