పెద్దనోట్ల రద్దు జరిగి చాన్నాళ్లవుతోంది. అయితే ఇప్పటికి 98.42 శాతం మేర రూ.2,000 నోట్లు వెనక్కి వచ్చినట్టు ఆర్బీఐ ప్రకటించింది. 2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకునే నాటికి.. రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు చలామణిలో ఉండగా, 2026 జనవరి 31 నాటికి రూ.5,609 కోట్లకు తగ్గిపోయినట్టు ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. అంటే.. ఇంకా 1.58 శాతానికి సమానమైన పెద్ద నోట్లు వ్యవస్థలోనే ఉన్నట్టు తెలుస్తోంది.
తొలుత 2023 అక్టోబర్ 7 వరకు అన్ని బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల డిపాజిట్, మార్పిడికి ఆర్బీఐ అవకాశం కల్పించింది. ఆ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికీ తమ వద్ద రూ.2,000 నోట్లు ఉంటే, ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో దేనికి అయినా స్పీడ్పోస్ట్ ద్వారా పంపుకోవచ్చు. పంపించే వారు దరఖాస్తుతోపాటు కేవైసీ డాక్యుమెంట్లు, బ్యాంక్ ఖాతా వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు అంత విలువ మేర బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.


