భద్రాచలం: గిరిజనుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన గిరిజనదర్బార్లో ఆయన వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించి ఆయాశాఖల అధికారులకు ఎండార్స్ చేశా రు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎల్టీఆర్ భూ సమస్య పరిష్కరించాలని పెనుబల్లి మండలం వీఎంబంజరకు చెందిన లక్ష్మి, చర్ల మండలానికి చెందిన ఇసుక సొసైటీ మహిళలు సొసైటీ సమస్యలు పరిష్కరించాలని, ఏకలవ్య పాఠశాల నిర్మాణంలో తమ భూమి పోయినందున ఉపాధి కల్పించాలని రేలకాయలపల్లి గ్రామానికి చెందిన రమ్య ఫిర్యాదులు అందజేశారు. దుమ్ముగూడెం మండలం మహాదేవపూర్ గ్రామానికి చెందిన బాబూరావు సోలార్ విద్యుత్ కనెక్షన్ కోసం, గుండాల మండలం ముత్తాపురం గ్రామానికి చెందిన వెంకన్న ఆశ్రమ పాఠశాలలో వాచ్మెన్ పోస్టు కోసం, పాల్వంచకు చెందిన రాంబాబు ట్రైకార్ రుణం కోసం, మణుగూరు మండలం సమితి సింగారం గ్రామానికి చెందిన వరలక్ష్మి కిరాణా షాప్ పెట్టుకునేందుకు రుణం ఇప్పించాలని వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు డేవిడ్ రాజ్, అశోక్, అరుణకుమారి, మధుకర్, సైదులు, రాంబాబు, లక్ష్మీనారాయణ, ఉదయ్కుమార్, నాగేశ్వరరావు, మేనేజర్ ఆదినారాయణ పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


