కొత్తగూడెంఅర్బన్ : సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ను తరిమి కొట్టేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని డీఈఓ బి.నాగలక్ష్మి అన్నారు. జిల్లాస్థాయిలో ఎంపిక చేసిన 20 పాఠశాలల నుంచి 60 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు ‘డ్రగ్స్ వినియోగానికి అడ్డుకట్ట – భవితకు బంగారు బాట’ అనే అంశంపై మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లాకు మూడు రాష్ట్రాల సరిహద్దులు ఉండడంతో పలు మార్గాల ద్వారా గంజాయి వంటి మత్తు పదార్థాలు రవాణా అవుతున్నాయని, వాటి వినియోగం కూడా పెరిగే ప్రమాదం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని, తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు. చెడు స్నేహాలు, చెడు అలవాట్లను మానుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పాల్వంచ ఎకై ్సజ్ సీఐ ప్రసాద్ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగిస్తూ లేదా సరఫరా చేస్తూ పట్టుబడినా కఠిన శిక్షలు ఉంటాయని వివరించారు. వైద్యులు శైలేష్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగదారుల్లో విపరీత ధోరణలు పెరుగుతాయని, తద్వారా వారు శారీరకంగా సర్వశక్తులు కోల్పోవడమే కాక, సమాజంలో ఎందుకు పనికిరాని వారుగా తయారవుతారని తెలిపారు. అశ్వారావుపేట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి సాయి కౌశిక్ తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నాడు. కార్యక్రమంలో సీఎంఓ సైదులు, అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ. నాగరాజశేఖర్, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్.సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎయిడ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి
ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డీఈఓ నాగలక్ష్మి అన్నారు. జిల్లా విద్యాశిక్షణ కేంద్రంలో ఎయిడ్స్ నిర్మూలనపై మంగళవారం జిల్లా స్థాయి పోస్టర్ మేళా పోటీలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలని సూచించారు. ఉమ్మడి జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్టు మేనేజర్ సత్య కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఎయిడ్స్ కేసులు అక్కడక్కడా నమోదవుతున్నాయని, వీటి నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు. అనంతరం పోస్టర్ మేళాలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.


