భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
పెద్దమ్మతల్లి ఆలయంలో రుద్రహోమం
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయంలో మంగళవారం మాసశివరాత్రి సందర్భంగా రుద్రహోమం నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేద మంత్రాలతో స్వామివారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. మండపారాధన, గణపతి పూజ చేశాక రుద్రహోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. హోమంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో వేద పండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్ పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత శివాలయంలో నందీశ్వరస్వామికి పంచామృతాభిషేకం చేశారు.
ఇస్రో రీసెర్చ్ స్కాలర్గా మల్కారం వాసి
దమ్మపేట : మండలంలోని మల్కారం గ్రామానికి చెందిన కొవల ముత్యాలరావు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పరిధిలోని తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో జూనియర్ రీసెర్చ్ స్కాలర్గా ఎంపికయ్యారు. కాగా ఆయన హైదరాబాద్ జేఎన్టీయూలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (మెకానికల్ ఇంజనీరింగ్)లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా మంగళవారం మల్కారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ముత్యాలరావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హెచ్ఎం మారెమ్మ, ఉపాధ్యాయులు శ్యామలాదేవి, ఈశ్వర్ రెడ్డి, నాగాచారి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


