● నవమికి భద్రాచలానికి సీఎం రేవంత్ రాక ● ఎన్హెచ్ 930పీ, మల్కన్గిరి పనులపై దృష్టి ● సీతారామ డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయాలి ● కలెక్టర్ అంకిత్కు మంత్రి తుమ్మల ఆదేశాలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రూ.300 కోట్లతో భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆల య పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తొలి విడతలో సుమారు రూ. 100 కోట్లతో ఆలయ ప్రాకారం నిర్మాణ పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రి తుమ్మలతో కలెక్టర్ అంకిత్ కొత్తగూడెంలోని ఇల్లెందు గెస్ట్హౌస్లో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా సీఎం పర్యటనతోపాటు జిల్లాలో పెండింగ్లో ఉన్న వివిధ పనులకు సంబంధించిన అంశాలపై కలెక్టర్కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
సీఎం పర్యటనకు ఏర్పాట్లు..
శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలానికి రానున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి తుమ్మల సూచించారు. భద్రతా ఏర్పాట్లు, రవాణా, భక్తులకు సౌకర్యాలు, వసతి తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తుగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
ఎయిర్పోర్ట్కు అనువైన భూమిని గుర్తించాలి
భద్రాచలం–మల్కన్గిరి రైల్వేలైనులో భాగమైన పాండురంగాపురం–మల్కన్గిరి సెక్షన్లో ట్రాక్ నిర్మాణానికి అనుమతి లభించిందని మంత్రి తెలిపారు. రైల్వేలైను నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పనులు సారపాకలో పూర్తి చేయాలన్నారు. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వరకు ఇల్లెందు మీదుగా నిర్మిస్తున్న జాతీయ రహదారి (ఎన్హెచ్ 930పీ)కి సంబంధించి జిల్లా పరిధిలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు. గతంలో జిల్లాలో రెండు చోట్ల విమానాశ్రయాలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని, అయితే, సాంకేతిక, భౌగోళిక కారణాల వల్ల ఆ ప్రదేశాలు ఎయిర్పోర్ట్ నిర్మానానికి అనుకూలంగా లేవని తేలిందన్నారు. దీంతో భద్రాచలం–కొత్తగూడెంల మధ్య ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుకూలమైన భూమిని గుర్తించాలని కలెక్టర్ను ఆదేశించారు. రవాణా రంగంలో సౌకర్యాలు మెరుగుపడితే దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం సాంస్కృతిక శోభ వెల్లి విరుస్తుందన్నారు.
సీతారామ భూసేకరణ..
సీతారామ డిస్ట్రిబ్యూటరీ పనులకు అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. భూసేకరణ పూర్తయితే ప్రాజెక్టు పనులు వేగవంతమై రైతులకు త్వరగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. యాతాలకుంట టన్నెల్లో మిగిలిన సుమారు 100 మీటర్ల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు యాభై వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆయిల్ పామ్ సాగుకు అందిస్తున్న సబ్సిడీలపై రైతులకు విస్త్రృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.


