మార్క్ఫెడ్ ద్వారా
కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు
ఖమ్మంవ్యవసాయం: మొక్కజొన్నల కొనుగోళ్లకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మక్కలకు క్వింటాకు కనీస మద్దతు ధర రూ. 2,400గా నిర్ణయించగా, ప్రైవేట్ వ్యాపారులు రూ.1,600 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యాన ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా పంట పడిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో రైతులు యాసంగి పంటగా 1.67 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. భద్రాద్రి జిల్లాలో 72 వేల ఎకరాల్లో పంట సాగైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 2.40 లక్షల ఎకరాల్లో పంట సాగు చేయగా, 6.24 లక్షల టన్నుల పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 40 నుంచి 55 వరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. మంగళ, బుధవారాల్లో ఈ ప్రక్రియకు ప్రభుత్వ శాఖలు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి.


