రఘునాథపాలెం: నాగార్జునసాగర్ ప్రధాన కాల్వకు చెందిన రూ.కోట్ల విలువైన సాగర్ మిగులు భూమిపై ఆక్రమణకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ భూముల ఆక్రమణపై జిల్లావ్యాప్తంగా చర్యలు కొనసాగుతుండగా, మరోవైపు కొందరు భూములను ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రఘునాథపాలెం మండలంలోని వీవీపాలెం రెవెన్యూ పరిధిలో ఎన్ఎస్పీ ప్రధాన కాల్వ సమీపంలో సర్వే నంబర్ 273లో సుమారు 10 ఎకరాలకుపైగా మిగులు భూమి ఉన్నట్లు సమాచారం. అందులో కొంత ఇటీవల పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించేందుకు లేఔట్ చేసి హద్దురాళ్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే ఆ భూమిలో ఉన్న కాల్వ తవ్వకంలోని మట్టి కుప్పలను ప్రభుత్వం తరలించి చదును చేసి ఉంచింది. ఆ భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం లేఔట్ చేసిన దానికి ఆనుకొని ఇంకా ఉన్న మిగులు భూమిలో కొంత భాగానికి కొందరు ఫెన్సింగ్ వేసి, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ఎకరం భూమి రూ.3 కోట్లు పలుకుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై జల వనరుల శాఖ ఏఈ సతీశ్ను సంప్రదించగా ఫెన్సింగ్ వేస్తున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి పనులను నిలిపివేయించామని, భూమికి స్పష్టమైన హద్దులు నిర్ణయించాలంటూ తహసీల్దార్కు లేఖ రాశామని చెప్పారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పనులు జరగడం లేదని స్పష్టం చేశారు.


