ఖమ్మంఅర్బన్: బంధువుల గృహ ప్రవేశ వేడుకకు హాజరైన మహిళ గుండెపోటుతో మృతిచెందిన ఘటన ఖమ్మం నగరంలో విషాదాన్ని నింపిన ఘటనలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన బొమ్మ సుస్మిత(40) ఖమ్మం 15వ డివిజన్లోని పుట్టకోట వద్ద బంధువుల గృహప్రవేశ కార్యక్రమానికి ఆదివారం వెళ్లింది. అందరితో ఉత్సాహంగా గడుపుతున్న సమయంలో గుండెపోటుకు గురై కుప్పకూలింది. వెంటనే బంధువులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సుస్మిత ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుండగా, ఆమె భర్త బొమ్మ వెంకటరమణ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. వీరికి విశ్వ జయంత్ అనే కుమారుడు ఉన్నాడు. సంతోషకరమైన వేడుకలో పాల్గొంటూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు. విషాద చాయల నడుమ సోమవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలు కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఖమ్మంలో మహిళ మృతితో విషాదం


