కారేపల్లి: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయాన అన్యాయం చేయొద్దని రైతులు కోరారు. కారేపల్లి మండలం రేలకాయలపల్లి రెవెన్యూ చీమలపాడులో పలువురు రైతుల నుంచి సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి భూమి సేకరించారు. ఇక్కడ 67 ఎకరాల్లో సుబాబుల్ తోటలు సాగు చేయగా, చేతికి వచ్చే సమయాన భూసేకరణ పూర్తయి పరిహారం కూడా చెల్లించారు. అయితే, చివరి పంట తమకే ఇవ్వాలని కోరుతూ రైతులు శనివారం తోటలను నరికేందుకు సిద్ధమయ్యారు. దీంతో డీఈ కిషోర్, ఏఈ రంజిత్, వర్క్ ఇన్స్పెక్టర్ రామస్వామి చేరుకుని అడ్డగించారు. పంట తీసుకునే హక్కు కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యే రాందాస్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినందున సహకరించాలని కోరారు. ఈమేరకు నిర్వాసిత రైతులు పాటి రమేష్, బచ్చలి వెంకటేశ్వర్లు, పాటి రాంబాబు, మాలోతు స్వామి, గుజ్జర్లపూడి సైదులు, పాటి రంగయ్య, పాటి రామయ్య, మాలోతు బావ్సింగ్, మాచర్ల రమేష్ తదితరులు కోరినా అధికారులు వినకపోవడంతో తోపులాట, వాగ్వాదం జరిగింది. చివరకు డీఈ కిషోర్ కారేపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు.
సుబాబుల్ నరికివేత సందర్భంగా వాగ్వాదం


