రుద్రంపూర్: సింగరేణిలో పెండింగ్ సమస్యల పరి ష్కారం, సంస్థ పరిరక్షణకు ఈ నెల 17న సంస్థవ్యాప్తంగా గనులు, డిపార్ట్మెంట్ల వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఏఐటీయూసీ అదనపు కార్యదర్శి మిరియాల రంగయ్య ితెలిపారు. సోమవారం కొత్తగూడెంలోని శేషగిరిభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. డైరెక్టర్ (పా) ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండటం లేదని, దీంతో సమస్యలు విన్నవించేందుకు వివిధ ఏరియాల నుంచి వస్తున్న కార్మికులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. గతేడాది కంపెనీ ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చూపిందని, తక్కువ లాభం వచ్చినా, ఎక్కువ వచ్చి నట్లు ప్రకటించిందని ఆరోపించారు. రూ.6వేల కోట్ల లాభం ప్రకటించి, అందులో రూ.4వేలకోట్లు నూతన ప్రాజెక్ట్ కోసం కేటాయించినట్లు కంపెనీ పేర్కొందన్నారు. ఆ రూ.4వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కంపెనీకి వచ్చిన లాభాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు వంగా వెంకట్, మల్లికార్జున్రావు, వీరస్వామి, గట్టయ్య, సందెబోయిన శ్రీనివాస్, హుమాయిన్, రాము, క్రిష్టాఫర్, ఎర్రగాని కృష్ణయ్య, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.


