అభివృద్ధి బాధ్యత నాదే..
● కార్పొరేషన్లో ఏ పని కావాలన్నా ప్రభుత్వంతోనే సాధ్యం ● కాంగ్రెస్, మిత్రపక్షాలను గెలిపించండి ● ఎన్నికల ప్రచార సభలో మంత్రి పొంగులేటి
కొత్తగూడెంఅర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, మిత్రపక్షాల అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని త్రీటౌన్ సెంటర్, రామవరంలో సోమవారం జరిగిన కార్నర్ మీటింగ్లలో ఆయన మాట్లాడారు. సింగరేణి ప్రాంతమైన కొత్తగూడెంలో 76 జీఓ క్రమబద్ధీకరణ పట్టాల సమస్య ఉందని, దాన్ని పరిష్కరించడంతో పాటు రోడ్లు, డ్రెయినేజీల అభివృద్ధి బాధ్యత తనదేనని చెప్పారు. తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత వాసులకు పెద్దకొడుకుగా ఉంటానని, యువతకు ఉపాధి కల్పించేలా కృషి చేస్తానని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అనేక సమస్యలు పరిష్కరించామని తెలిపారు. కొత్తగూడెం తన సొంత గడ్డ అని, కార్పొరేషన్పై తొలిసారి కాంగ్రెస్ జెండా ఎగరవేసే బాధ్యత కూడా తనదేనని ప్రకటించారు. రంగురంగుల కండువాలతో కొంత మంది వస్తారని, మంత్రి శ్రీనన్న తమకు దగ్గర వాడంటూ చెప్పే మాటలు నమ్మొద్దని సూచించారు. ఏ పని కావాలన్న ప్రభుత్వంతోనే సాధ్యమని, ఈ ఎన్నికల్లో కత్తి మరొకరికి ఇస్తే యుద్ధం తాము చేయలేమని అన్నారు. చిట్టి రామవరంలో పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎవరి బెదిరింపులకు భయపడకుండా ఓట్లతోనే సమాధానం చెప్పాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, పార్టీ నాయకులు ఆళ్ల మురళి, కంచర్ల చంద్రశేఖర్, జేవీఎస్ చౌదరి, అభ్యర్థులు కనుకుంట్ల శ్రీను, బాలిశెట్టి సత్యభామ, కనుకుంట్ల కుమార్, కనుకుంట్ల వెంకటరమణ, ఆకునూరి సుప్రియ, పోతు పురుషోత్తం, పల్లా రాజనర్సు, సీపీఎం నాయకులు రమేష్, జలాల్ తదితరులు పాల్గొన్నారు.


