మేయర్ పీఠం సీపీఐదే..
సూపర్బజార్(కొత్తగూడెం): కార్పొరేషన్ ఎన్నికలు అహంకారానికి ఆత్మీయతకి మధ్య జరుగుతున్నాయని, మేయర్ పీఠం సీపీఐదేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రామవరంలోని ఆరు డివిజన్లు, బర్మాక్యాంపు, ప్యూన్బస్తీ, ఏ–పవర్హౌస్బస్తీ, గంగబిషన్బస్తీలో రోడ్ షోలు, కార్నర్ మీటింగుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎర్ర జెండాది ఏముందిలే అంటూ అవాకులు చవాకులు పేలుతున్న వాళ్లు సీపీఐకి అందుతున్న ఆదరణను చూసి ఎందుకు హైరానా పడుతున్నారని, 60 డివిజన్లలో ఎరుపు, పసుపు రంగుల జెండాలు రెపరెపలాడుతున్నాయన్నారు. ప్రభుత్వంతో కొట్లాడి కార్పొరేషన్ను ఏర్పాటు చేసుకున్నామని, రాబోయే రోజుల్లో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు వస్తాయని, అన్నిరంగాలు అభివృద్ధి సాధిస్తాయని తెలిపారు. ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, ప్రజల ఆశీర్వాదమే బలమని, సీపీఐ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా సుపరిపాలనను స్వాగతించినట్లు అవుతుందని వివరించారు. కార్పొరేషన్వ్యాప్తంగా చక్కటి ఫలితాలు రానున్నాయని, మేయర్ పీఠం సీపీఐదేనని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు


