ముక్కోటికి రూ.కోటిన్నర
రూ. కోటి తాత్కాలిక పనులకే
● వేడుకల ఏర్పాట్లకు నిధుల కేటాయింపు ● భద్రాచలం దేవస్థానంలో సాగుతున్న పనులు ● ఈ నెల 20 నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 20 నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం సుమారు రూ. 1.5 కోట్లతో పనులు చేపడుతున్నారు. ఇప్పటికే టెండర్లు ఖరారుకాగా, కొన్ని పనులు శరవేగంగా సాగుతున్నాయి. కలెక్టర్ జితేష్ వి. పాటిల్ భద్రాచలంలో ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాలను, పనులను పర్యవేక్షించారు. సత్వరమే పనులను పూర్తి చేయాలని, సామాన్య భక్తులకు ఉచిత వసతి ఏర్పాట్లు ప్రత్యేకంగా ఉంచాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు.
నిధుల కేటాయింపు ఇలా..
వైకుంఠద్వారం, నిత్యకల్యాణ మండపాలకు పంచరంగులకు రూ.9.20 లక్షలు వెచ్చించనున్నారు. ప్రధాన ఆలయంలో పెయింటింగ్కు సుమారు రూ.8.5 లక్షలు, పర్ణశాల వద్ద కల్యాణ మండపం, గోదావరి ఘాట్ల వద్ద తాత్కాలిక వసతికి రూ.6.35 లక్షలు ఖర్చు చేయనున్నారు. గోదావరి తీరంలో బాణసంచాలకు రూ.6 లక్షలు, భక్తులు దుస్తులు మార్చుకునే గదులు, కార్పెట్లు, ఉచిత వసతి కోసం రూ.5.5 లక్షలు, ఎల్ఈడీ స్క్రీన్లు, వ్యాన్లకు రూ.3.63 లక్షలు, ఆర్చ్గేట్లకు రూ.2 లక్షలు, వాల్పోస్టర్లు, సెక్టార్ టికెట్లు, ఆహ్వానాల ప్రింటింగ్కు రూ.2 లక్షలు కేటాయించారు. పూల అలంకరణకు రూ.7.70 లక్షలు, తెప్పోత్సవంలో హంసవాహనం అలంకరణకు రూ.4 లక్షలు, గోదావరిలో ర్యాంప్ అద్దెకు రూ.5 లక్షలు, సౌండ్ సిస్టంకు రూ.90 వేలు, ఫ్లెక్సీలకు, ప్రింటింగ్ ఖర్చులకు సుమారు రూ.3 లక్షలు ఖర్చు చేయనున్నారు.
టెండర్ ఖరారు కాకుండా,
కోడ్ వేళ విధుల్లోకి..?
దేవస్థానంలో ఔట్ సోర్సింగ్ విభాగంలో ఇప్పటికే ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. ఇటీవల మరో ఐదుగురి నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. దేవస్థానం టెండర్లు ఆహ్వానించినా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఖరారు చేయలేదు. అయితే టెండర్ ఖరారు కాకుండానే ఓ మహిళ బుధవారం విధుల్లో చేర్చుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో సదరు ఉద్యోగిని అప్పటి ఈఓ విధుల నుంచి తొలగించారు. ఆమెనే మళ్లీ, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, విధుల్లోకి తీసుకోవడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ముక్కోటికి వచ్చే భక్తులకు సరిపడా వసతులకు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పనులు చాలావరకు పూర్తయ్యాయి. గ్రీనరీ పెంచేందుకు కూడా చర్యలు చేపట్టాం. ముక్కోటి పనుల్లో సేవల కోసం ఔట్సోర్సింగ్ ఉద్యోగినిని ముందస్తుగా పిలిపించాం.
– కొల్లు దామోదర్రావు, ఈవో, రామాలయం
ముక్కోటి సందర్భంగా భద్రాచలంలో చేపట్టే తాత్కాలిక పనులకు సుమారుగా కోటి రూపాయలు వెచ్చించనున్నారు. మరో రూ. 50 లక్షలు ఇతర పనులకు ఖర్చు చేయనున్నారు. ఇందులో అత్యధిక పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆలయం, కల్యాణ మండపం పరిసర ప్రాంతాల్లో రంగులు వేసే పనులు చివరి దశకు చేరుకోగా, చలువ పందిళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. హంసవాహనం విడి భాగాలను బయటకు తీస్తున్నారు. కాగా గతంలో సెక్టార్ల టికెట్ల విరక్రయాలు ముందస్తుగానే చేపట్టినా ఈ ఏడాది ఇంతవరకు దీనిపై నిర్ణయం వెలువడలేదు.
ముక్కోటికి రూ.కోటిన్నర


