అంతా ఏకతాటిపై!
● అమాత్యుల గ్రామాల్లో ఏకగ్రీవాలు ● డిప్యూటీ సీఎం భట్టి స్వగ్రామం స్నానాల లక్ష్మీపురంలో ఖరారు ● మంత్రులు పొంగులేటి, తుమ్మల గ్రామాల్లోనూ అదేబాట
●కల్లూరు మండలం నారాయణపురం గ్రామపంచాయతీని ఏకగ్రీవం చేసేలా చర్చలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి స్వగ్రామమైన నారాయణపురంలో 1,385 మంది ఓటర్లు, పది వార్డులు ఉన్నాయి. మూడో విడతలో ఇక్కడ ఎన్నిక జరగనుండగా శుక్రవారం వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశముంది. ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయిన ఈ స్థానంలో మొదటి రెండు రోజులు ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. ఏకగ్రీవం దిశగా ప్రయత్నాలు జరుగుతుండటంతో ఎవరూ నామినేషన్ వేయలేదని తెలిసింది. నిర్ణయం జరిగాక చివరి రోజు సర్పంచ్, వార్డులకు ఒక్కో నామినేషన్ దాఖలు చేసేలా చర్చిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా ఈ పంచాయతీ ఏకగ్రీవమైంది. అప్పుడు రెండున్నర ఏళ్లు ఒక పాలకవర్గం, మరో రెండున్నర ఏళ్లు ఇంకో పాలకవర్గం పాలన సాగించింది.
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా మంత్రుల గ్రామాలు ఏకగ్రీవం దిశగా అడుగులు వేస్తున్నాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్వగ్రామమైన వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం పాలకవర్గం ఇప్పటికే ఏకగ్రీవమైంది. అలాగే, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురం కూడా ఏకగ్రీవం కానుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గ్రామమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోనూ ఏకగ్రీవం దిశగా చర్చలు కొనసాగున్నాయి. వీరు కాక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల ఇలాఖాల్లో ఎన్నికలు ఉంటాయా.. ఏకగ్రీవం అవుతాయా అన్న చర్చ ఆసక్తికరంగా మారింది.
●కామేపల్లి మండలంలోని మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి వెంకట్రెడ్డి స్వగ్రామం పాతలింగాల గ్రామపంచాయతీ పాలకవర్గం గత 35 ఏళ్లుగా ఎన్నికలే లేకుండా ఏకగ్రీవమవుతోంది. ఈసారి ఎస్టీ మహిళకు సర్పంచ్ స్థానం రిజర్వ్ కాగా గ్రామస్తులు ఏకగ్రీవం బాట అనుసరించారు. ఎన్నికల షెడ్యూల్ రాగానే అంతా సమావేశమై ఏకాభిప్రాయానికి రాగా కిన్నెర సుజాతతో నామినేషన్ దాఖలు చేయించారు. అలాగే ఎనిమిది వార్డులకు కూడా ఒక్కో నామినేషన్ దాఖలవడంతో పాలకవర్గమంతా ఏకగ్రీవం అయినట్లయింది.
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ మద్దతుదారుడు అభ్యర్థి నూతి వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో ఏడుగురు నామినేషన్లు వేసినా చివరి రోజునాటికి ఆరుగురు ఉపసంహరించుకున్నారు. దీంతో వెంకటేశ్వర్లుతో పాటు ఎనిమిది వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి.
అంతా ఏకతాటిపై!


