
శాంతి భద్రతలను పరిరక్షించాలి
కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్
జూలూరుపాడు: శాంతి భద్రత పరిరక్షణే పోలీసుల ధ్యేయమని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. జూలూరుపాడు పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. రికార్డులు, ఫైల్స్ పరిశీలించారు. పనితీరు, పెండింగ్ కేసుల పురోగతి, కోర్టు పరిధిలో ఉన్న కేసుల వివరాలపై సిబ్బందితో చర్చించారు. కార్యక్రమంలో జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, జూలూరుపాడు, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి ఎస్సైలు బాదావత్ రవి, శివరామకృష్ణ, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఘనంగా ఫ్రెషర్స్ డే
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నతస్థానాలకు ఎదగాలని సూచించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలు, మాదకద్రవ్యాలతో జరిగే నష్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. అధ్యాపకులు బండి వెంకటేశ్వరరావు, దనకొండ నరసింహారావు, బండి లక్ష్మణ్, రామలక్ష్మి, శ్రీరాములు, ప్రోగ్రాం కన్వీనర్ సముద్రాల శ్రీనివాస్, లైబ్రరీ బాబు, వన్ టౌన్ సీఐ కరుణాకర్ పాల్గొన్నారు.
జామాయిల్ చెట్ల నరికివేతపై కేసు నమోదు
ములకలపల్లి: జామాయిల్ చెట్లు నరికివేతపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎస్సై మధుప్రసాద్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని పొగళ్లపల్లి శివారు అటవీశాఖ (టీజీ ఎఫ్డీసీ) ఆధ్వర్యంలో జామాయిల్ తోటలను పెంచుతున్నారు. ఈ నెల 5న అక్రమంగా జామాయిల్ చెట్లు నరుకుతుండగా, స్థానిక సిబ్బంది చేరుకునేలాగో నిందిడుతు పరారయ్యాడు. దంతెలబోరు గ్రామానికి చెందిన కాకర్ల చిన్నముత్యాలు అనే వ్యక్తి ప్లాంటేషన్లోని 80 చెట్లు నేలకూల్చాడని, రూ. 30 వేల నష్టం వాటిల్లిందని ప్లాంటేషన్ మేనేజర్ (పీఎం) నాగరాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ముగ్గురిపై..
పాల్వంచరూరల్: పశువులు, మేకలు మేపి జామాయిల్ తోటకు నష్టం కలిగించిన ఘటనలో శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండల పరిధిలోని మొండికట్ట గ్రామ శివారులో తొంగల వెంకన్నకు చెందిన భూమిలో జామాయిల్ మొక్కలను సాగు చేశాడు. శుక్రవారం అదే గ్రామానికి చెందిన సంపంగి మల్లేశ్, నవీన్, ఓర్సు మల్లేష్ పశువులు, మేకలను చేలో మేపడంతో నాలుగువేల మొక్కలకు నష్టం వాటిల్లింది. బాధిత రైతు ఫిర్యాదుతో ముగ్గురు పశువుల కాపరులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు.
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన యువకుడిపై..
దమ్మపేట: నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన యువకుడిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. అశ్వారావుపేట మండలంలోని దురదపాడు గ్రామానికి చెందిన కుంజా చందు(19) అచ్యుతాపురం క్రాస్ రోడ్డు వద్ద నిర్లక్ష్యంగా బైక్ నడుపుతూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేశాడు. పోలీస్ సైరన్ వాడుతూ, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించాడు. డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ బాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు.

శాంతి భద్రతలను పరిరక్షించాలి