
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరి పారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
నేడు గిరిజన దర్బార్
భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేయాలని కోరారు. అధికారులు ఉదయం 10.30 గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో హాజరుకావాలని పేర్కొన్నారు.
నేడు ప్రజావాణి రద్దు
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా అధికారులంతా బతుకమ్మ సంబురాల ఏర్పాట్లలో నిమగ్నమైన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తులు అందజేసేందుకు కలెక్టరేట్కు రావొద్దని సూచించారు.
కిన్నెరసాని ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తివేత
పాల్వంచరూరల్: కిన్నెరసాని జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరిగింది. 407 అడుగుల నీటి నిల్వసామర్థ్యం కలిగిన కిన్నెరసాని రిజర్వాయర్లోకి 8వేల క్యూసెక్కు ల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆదివా రం నీటిమట్టం 406.30 అడుగులకు పెరిగింది. ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తి ఉంచి 13వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు.
నేటి నుంచి
ఓపెన్ స్కూల్ పరీక్షలు
ఖమ్మం సహకారనగర్ : ఓపెన్ స్కూల్ పది, ఇంటర్మీడియట్ పరీక్షలు ఈనెల 22 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో సెషన్లో పరీక్షలు ఉంటాయని, ఖమ్మం నగరంలోని పదో తరగతి, ఇంటర్కు ఒక్కో పరీక్ష కేంద్రం చొప్పున ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల కేంద్రంలో పదో తరగతి విద్యార్థులు 287 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాల(రిక్కాబజార్) కేంద్రంలో 254 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఒక్కో కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ అధికారిని నియమించామని, ప్రతీ సెంటర్కు సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేశామని, తాగునీరు, మెడికల్, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించామని వివరించారు. ఏమైనా సందేహాలుంటే ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ కూరపాటి మంగపతిరావు(80084 03522)ను సంప్రదించాలని సూచించారు. కాగా పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఈఓ దీక్షారైనా తెలిపారు.
వారసత్వ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ
ఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియా ఉద్యోగుల వారసులకు కారుణ్య నియమాకాల కోసం ముఖాముఖి నిర్వహించారు. ఆదివారం జీఎం కార్యాలయంలో ఎస్ఓటూ జీఎం రామస్వామి, డీజీంఎ పర్సనల్ తుకారాం ఆధ్వర్యంలో మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగుల వారసులకు కుటుంబ సభ్యులు, సాక్షుల సమక్షంలో ఇంటర్వ్యూ నిర్వహించారు. అన్ని వివరాలు నమోదు చేసి వైద్య పరీక్షలకు పంపారు.

రామయ్యకు సువర్ణ పుష్పార్చన