
మొర్రేడులో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి
పాల్వంచ: మొర్రేడు వాగు దాటుతుండగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని వనమా బజార్కు చెందిన ఆటో డ్రైవర్ యాట సురేష్(35) ఆదివారం బంగారు జాలలో ఉండే అత్తగారింటికి వెళ్లేందుకు గుడిపాడు వద్ద మొర్రేడు వాగు దాటుతున్నాడు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండి నీళ్లలో కొట్టుకు పోయాడు. సాయంత్రం ఇంటికి రాక పోవడంతో సోమవారం కుటుంబ సభ్యులు వెతుకగా మొర్రేడు వాగు బ్రిడ్జి వద్ద నీళ్లలో సురేష్ మృతదేహం లభించింది. మృతుడి భార్య దుర్గాభవాని ఫిర్యాదుతో ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గడ్డి మందుతాగిన
వివాహిత మృతి
పాల్వంచరూరల్: గడ్డి మందు తాగిన మహిళ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కోడిపుంజులవాగు గ్రామానికి చెందిన కొర్ర ఈరీ(42) కుటుంబ సభ్యుల మందలించారని మనస్తాపం చెంది ఈ నెల 6న ఇంట్లో పురుగుల మందు తాగింది. అపస్మారకస్థితిలోపడి ఉండగా కుటుంబ సభ్యులు గమనించి పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు, అనంతరం హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
బూర్గంపాడు: పినపాక పట్టీనగర్ గ్రామం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. పాల్వంచ వైపు నుంచి భద్రాచలం వైపు వస్తున్న ఓ మోటార్ సైకిల్ను ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో మోటార్సైకిల్పై ప్రయాణిస్తున్న యువకుడికి, యువతికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా ప్రాంతానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. కాగా బాధితుల నుంచి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ తెలిపారు.
పేకాట స్థావరంపై దాడి
అశ్వారావుపేటరూరల్: పేకాట స్థావరంపై పోలీసులు సోమవారం రాత్రి దాడి చేశారు. ఎస్సై అఖిల కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని ఫైర్ కాలనీ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. రూ.1,850 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.