
నిందితుల వివరాలను వెల్లడించిన ఏసీపీ రమణమూర్తి
అంతర్ జిల్లాల దొంగలు అరెస్ట్
రూ.16లక్షల విలువైన సొత్తు స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మం జిల్లాలో వివిధ ప్రాంతాలతో పాటు ఖమ్మం వన్టౌన్, టూటౌన్, అర్బన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వివరాలను సోమవారం నగర ఏసీపీ రమణమూర్తి వెల్లడించారు. ఖమ్మం ముస్తఫానగర్లో కారు డ్రైవర్గా పనిచేస్తూ చోరీలకు పాల్పడుతున్న పాతనేరసుప్తడు చల్లా వెంకటేశ్వర్లు, భద్రాచలం శ్రీరామ్నగర్కు చెందిన దేవనబోయిన మహేష్ అలియాస్ బాతు పలు ప్రాంతాల్లో తిరుగుతూ తాళాలు వేసి ఇళ్లను గుర్తించేవారు. ఆపై రాత్రివేళ చోరీ చేసి ఆ డబ్బుతో మూడు ద్విచక్రవాహనాలు కొనుగోలు చేశారు. వీటిపై తిరుగుతూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు.
ఖమ్మం నగరంతోపాటు, ఖమ్మం రూరల్, బోనకల్, కామేపల్లి, వేంసూరు, ఏన్కూరు, సత్తుపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లో చోరీ చేయగా, చల్లా వెంకటేశ్వర్లుపై గతంలోనే 15చోరీ కేసులు ఉన్నాయి. జైలు నుంచి విడుదలైనా తీరు మారకపోగా బట్టల షాపులో పనిచేసే మహేష్తో కలిసి చోరీలు మొదలుపెట్టాడు. ఖమ్మం నూతన బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనం పై వెళ్తున్న వీరిని అదుపులోకి తీసుకోవడం చోరీల విషయం బయటపడింది. దీంతో నిందితుల నుంచి రూ.13లక్షల విలువైన 127గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండితో పాటు టీవీ, సౌండ్బాక్స్, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.
తప్పుడు సమాచారంతో ఇక్కట్లు
సొత్తు పోగొట్టుకున్న వారిలో కొందరు అబద్ధపు వివరాలతో ఫిర్యాదు చేస్తున్నారని ఏసీపీ రమణమూర్తి తెలిపారు. రెండు తులాల ఆభరణాలు పది తులాలని, రోల్డ్గోల్డ్ నగలు పోతే నిజమైన నగలుగా ఫిర్యాదు చేస్తుండడంతో రికవరీలో ఇబ్బంది అవుతోందని పేర్కొన్నారు. కాగా, చోరీ అయిన సమయాన ఫిర్యాదు చేసేవారు బిల్లులు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, అపార్ట్మెంట్లలో చోరీచేసిన మధ్యప్రదేశ్కు చెందిన ధార్ ముఠాను గుర్తించామని చెప్పారు. కొన్ని అపార్ట్మెంట్లలో వాచ్మెన్లు లేకపోగా, ఉన్నచోట మద్యం సేవించి నిద్రిస్తుండడంతో దొంగలకు పని సులువవుతోందని తెలిపారు.ఈ సమావేశంలో సీసీఎస్ ఏసపీ సర్వర్, సీఐలు కరుణాకర్, బాలకృష్ణ, భానుప్రకాష్, రాజు తదితరులు పాల్గొన్నారు.