
ఇకపై పీఏసీఎస్ల ద్వారానే..
● డీలర్ల ద్వారా యూరియా పంపిణీ నిలిపివేత ● రైతుల ఇబ్బందుల నేపథ్యాన ప్రభుత్వ నిర్ణయం ● ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో అమలు
ఖమ్మంవ్యవసాయం: యూరియా పంపిణీని పూర్తిగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా(పీఏసీఎస్)ల ఆధ్వర్యంలోనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 40 శాతం మేర డీలర్ల ద్వారా, మిగతా పీఏసీఎస్ల ఆధ్వర్యాన పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే యూరియాకు ఈసారి కొరత ఏర్పడగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈనేపథ్యాన పీఏసీఎస్ల ద్వారా పంపిణీ చేస్తేనే ఎరువులు పక్కదారి పట్టకుండా పారద్శకత ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పాలేరు నియోజకవర్గంలో ఇప్పటికే ఈ విధానం అమలవుతుండగా, మిగతా ప్రాంతాల్లోనూ అమలుచేయనున్నారు.
డీలర్లకు నిలిపివేత
ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని 500 డీలర్లకు యూరియా సరఫరాను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఇకపై పూర్తిగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా పంపిణీ జరుగుతుంది. పీఏసీఎస్లకు దూరంగా ఉన్న గ్రామాల్లో సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి యూరియా పంపిణీ చేస్తారు. పాలేరు నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న ఈ విధానాన్ని జిల్లాలోని 76 పీఏసీఎస్ల పరిధిలో అమలుకు నిర్ణయించారు. ఇందుకోసం సహకార సంఘాలకు తోడు మరో 55 సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. మండల వ్యవసాయాధికారి పర్యవేక్షణలో ఏఈఓల ద్వారా కూపన్లు జారీ చేయనుండగా, పీఏసీఎస్ల సీఈఓలు, ఉద్యోగులు యూరియా అందిస్తారు.
మరో రెండు వ్యాగన్ల యూరియా
పందిళ్లపల్లి రేక్ పాయింట్కు రెండు రోజుల్లో రెండు వ్యాగన్ల యూరియా రానుందని ఖమ్మం జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఒక్కో వ్యాగన్లో 2,600 మెట్రిక్ టన్నుల యూరియా ఉంటుందని పేర్కొన్నారు. ఈ యూరియాను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు సరఫరా చేస్తామని తెలిపారు. కాగా, శుక్రవారం ఉమ్మడి జిల్లాకు 1,333 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఇందులో ఖమ్మం జిల్లాకు 483, భద్రాద్రి జిల్లాకు 500, మహబూబాబాద్ జిల్లాకు 250 మెట్రిక్ టన్నుల చొప్పున కేటాయించామని వెల్లడించారు.