
చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
మణుగూరుటౌన్: దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో ఈ నెల 9న మండలంలోని కూనవరం జీపీ రేగులగండి చెరువు వద్దకు వెళ్లిన కార్మికుల బృందంలో ఓసీ ఈపీ ఆపరేటర్ సుంకరి శ్రీనివాస్ (36) గల్లంతైన విషయం విదితమే. శుక్రవారం ఉదయం ఆయన మృతదేహం లభ్యమైంది. భద్రాచలం నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందం, మణుగూరు ఫైర్ రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి ఇద్దరు పిల్లలు, భార్య ఉండగా, ఇటీవల గోదావరిఖని నుంచి మణుగూరు బదిలీపై వచ్చాడు. కాగా, మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు కన్నీరుమున్నీరయ్యారు.
వాహనం ఢీకొని వృద్ధురాలి మృతి
దుమ్ముగూడెం: మండలంలోని నర్సాపురం గ్రామం ఎస్సీకాలనీలో టాటా ఏస్ వాహనం ఢీకొని కనుకు వెంకటమ్మ (60) మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. భద్రాచలంలోని ఓ శీతల పానీయానికి చెందిన టాటా ఏస్ వాహనం నర్సాపురం గ్రామంలో కూల్డ్రింక్స్ అన్లోడ్ చేసి రివర్స్ చేస్తుండగా రోడ్డుపై నడిచివస్తున్న వెంకటమ్మను ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన వెంకటమ్మను నర్సాపురం వైద్యశాలకు.. అక్కడి నుంచి భద్రాచలం తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. మృతదేహాన్ని భద్రాచలం ఏరియా వైద్యశాలలో ఉంచగా బంధువులు వైద్యశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఎస్ఐ గణేశ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
రేపల్లెవాడ రైతువేదికలో టీవీ చోరీ
ఇల్లెందురూరల్: మండలంలోని రేపల్లెవాడ రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్కు వినియోగించే టీవీ చోరీకి గురైంది. శుక్రవారం రైతువేదికలో టీవీ కనిపించక పోవడంతో గ్రామ పంచాయతీ సిబ్బంది వ్యవ సాయశాఖ అధికారుల కు సమాచారం అందించారు. పరిశీలించిన ఏడీఏ లాల్చంద్, ఏఓ సతీశ్ చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రైతువేదిక వద్దకు చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. గ్రామంలోని జర్పుల సాగర్ మూడు రోజుల కిందట టీవీ భుజంపై పెట్టుకొని ఇల్లెందు వైపుగా నడుచుకుంటూ వెళ్లడాన్ని చూశామని పలువురు రైతులు చెప్పడంతో అతని ఇంటి వద్దకు వెళ్లి విచారించారు. పోలీసులతోపాటు గ్రామస్తులు సైతం హెచ్చరించడంతో తానే చోరీ చేసినట్లు సాగర్ అంగీకరించాడు. సుభాష్నగర్ జీపీలో విక్రయించానని చెప్పడంతో పోలీసులు సాగర్ను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే టీవీని తెచ్చి పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని కొనుగోలు చేసిన వ్యక్తిని పోలీసులు ఆదేశించారు.
భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
కామేపల్లి: మండలంలోని బాసిత్నగర్కు చెందిన తేజావత్ మౌనికకు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన సపావట్ కృష్ణప్రసాద్కు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. మద్యానికి బానిసైన ఆయన కృష్ణప్రసాద్ మౌనికను అనుమానిస్తుండడంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు మూడేండ్ల కుమారుడు ఉన్నాడు. మౌనిక తండ్రి వీరన్న ఫిర్యాదుతో ఆమె భర్త, అత్త, ఆడబిడ్డపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం