
కొండరెడ్ల సంక్షేమానికి ప్రణాళిక
భద్రాచలం: మారుమూల ప్రాంతాల్లో నివసించే కొండరెడ్ల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు ఐటీడీఏ పీఓ బి. రాహుల్ తెలిపారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన తెగల అధ్యయన బృందం మంగళవారం భద్రాచలం వచ్చింది. ఈ సందర్భంగా రాహుల్ను కలిసిన సభ్యులు.. ఉట్నూరు ఏజెన్సీలో నివసిస్తున్న కొలమ్ గిరిజన తెగకు సంబంధించిన గ్రామాలు, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం పీఓ రాహుల్ మాట్లాడుతూ.. తాము గిరిజనులకు విద్య, వైద్యం కోసం మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. గిరిజన రైతులకు కరెంటు మోటార్లు, ఆయిల్పామ్ సాగుతో పాటు పలు రంగాల్లో శిక్షణ అందిస్తున్నామని వివరించారు. కొండరెడ్లు, కోయ, లంబాడా, నాయక్ పోడు గిరిజన తెగల గోత్రాలు, వారి ఇలవేల్పులకు సంబంధించిన అంశాలను స్టోరీల రూపంగా బుక్లెట్ ముద్రించి ఆగస్టు 9న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, పీవీటీజీ అధికారి రాజారావు, అధ్యయనం బృందం సభ్యులు ఆత్రం ముకుందరావు, కుడిమేత తిరుపతి, మర్సుకోల బాబూరావు, ఏకం వసంతరావు, సిడం భీమ్రావు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ బీమా కార్డులు..
గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధార్తీ ఆభాజాన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ శ్యాచురేషన్, పీఎం జన్మన్ కార్డులు పంపిణీకి చర్యలు తీసుకుంటామని రాహుల్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శరత్ వీసీ నిర్వహించగా జిల్లా నుంచి రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 10,290 మందికి బీమా కార్డులు అందజేశామని, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలకు 114 మెడికల్ కిట్లు అందించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. కాగా, అడిషనల్ డీఎంహెచ్ఓగా నియమితులైన బి.సైదులు పీఓ రాహుల్, ఎమ్మెల్యే వెంకట్రావును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆశ్రమ పాఠశాల సందర్శన..
జూలూరుపాడు: మండలంలోని పడమటనర్సాపురం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను పీఓ రాహుల్ మంగళవారం సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి భవిష్యత్లో ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. తాను ఐఏఎస్ కావాలనుకుంటున్నానని ఆరోతరగతి విద్యార్థిని వెంకటరమణి చెప్పగా, ఆ బాలికకు పెన్ను ఇచ్చి ప్రోత్సహించారు. అనంతరం టేబుల్ టెన్నిస్ ఇండోర్ గేమ్ను ప్రారంభించి విద్యార్థినులతో కలిసి టేబుల్ టెన్సిస్ ఆడారు. పిల్లల్లో నైపుణ్యత పెంపొందించేలా డిబేట్, వ్యాసరచన, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, కుట్లు, అల్లికల కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థినులు టీవీ కావాలని కోరగా వారం రోజుల్లో సమకూరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి గోపాల్రావు, హెచ్ఎం బానోత్ సుభద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

కొండరెడ్ల సంక్షేమానికి ప్రణాళిక