
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నివేదన, హారతి సమర్పించిన అర్చకులు ఆ తర్వాత మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి, అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు.
పోలీస్స్టేషన్లలో ఇంకుడుగుంతలు నిర్మించాలి
ఎస్పీ రోహిత్రాజు
కొత్తగూడెంటౌన్: జిల్లాలోని ప్రతీ పోలీస్స్టేషన్ ప్రాంగణంలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేయాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. ఎస్పీ కార్యాలయంలో నిర్మిస్తున్న ఇంకుడుగుంత పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంకుడు గుంతల ఏర్పాటుతో భూగర్భ జలాలు పెరుగుతాయని, భవిష్యత్లో నీటి కొరత సమస్యను అధిగమించవచ్చని తెలిపారు. వర్షపు నీటిని ఆదా చేసుకునేందుకు ప్రజలు కూడా ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించాలని కోరారు. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు.
గిరిజన కళాశాలల్లో ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గురువారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాలలో జరిగిన కౌన్సెలింగ్ను గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలల్లో వివిధ కోర్సులకు గాను 810 సీట్లు ఉండగా, 450 సీట్లలో బాలురకు ప్రవేశాలకు కల్పించామని తెలిపారు. మిగిలిన సీట్ల భర్తీకి త్వరలో ప్రకటన చేస్తామని చెప్పారు. అలాగే, బాలికల ప్రవేశాల కోసం శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు దేవదాస్, సీతారాం, వీరస్వామి, సత్యనారాయణ, భాస్కర్, హరికృష్ణ, పద్మావతి, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో చేరిన
108 ప్రోగ్రాం మేనేజర్
ఖమ్మంవైద్యవిభాగం/కొత్తగూడెంఅర్బన్ : ఈఎంఆర్ఐ, గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్గా శివకుమార్ నియమితులయ్యారు. ఉమ్మడి జిల్లాలోని 108(అత్యవసర సేవలు), 102(అమ్మ ఒడి), 1962(పశు సంచార) సేవలను పర్యవేక్షించనుండగా, గతంలో ప్రోగ్రాం మేనేజర్గా ఉన్న భూమా నాగేందర్ హైదరాబాద్ క్లస్టర్కు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో వరంగల్ నుంచి వచ్చిన శివకుమార్ గురువారం విధుల్లో చేరారు. అనంతరం ఉద్యోగులతో సమావేశమై పలు సూచనలు చేశారు.
తహసీల్దార్ల బదిలీలు
సూపర్బజార్(కొత్తగూడెం) : రాష్ట్రవ్యాప్తంగా పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న కొందరిని ఇతర జిల్లాలకు కేటాయించారు. ఇదే సమయాన ఇతర జిల్లాలకు చెందిన కొందరిని జిల్లాకు బదిలీ చేశారు. వీరు నిర్దేశిత జిల్లాల్లో రిపోర్ట్ చేశాక కలెక్టర్లు పోస్టింగ్ ఇస్తారు. జిల్లా నుంచి బదిలీ అయిన వారిలో ఎం.రమాదేవి ఖమ్మం జిల్లాకు, సీహెచ్.నరేష్, జి.వివేక్, ఎం.ఇమ్మానియేల్, ఎన్.నాగభవానీ మహబూబాబాద్ జిల్లాకు వెళ్లారు. కాగా, హన్మకొండ జిల్లా నుంచి ఆర్.అనంత రామకృష్ణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ఎల్.వీరభద్రం, ఖమ్మం జిల్లా నుంచి జి.ప్రతాప్, మహబూబాబాద్ జిల్లా నుంచి బి.భగవాన్రెడ్డి భద్రాద్రి జిల్లాకు రానున్నారు.

పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన