
అన్నదాతకు కన్నీరు..
బూర్గంపాడు: ఈ ఏడాది యాసంగి వడ్లు అమ్ముకునేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. అకాల వర్షాలతో అన్నదాతలు అవస్థ పడుతున్నారు. జిల్లాలో ఏప్రిల్ రెండో వారంలో యాసంగి వరికోతలు మొదలైనప్పటి నుంచి అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. రెండు, మూడు రోజులకోసారి కురుస్తున్న వర్షాలు రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మబ్బు పట్టడంతో ఉరుకులు, పరుగులతో ధాన్యం రాశులపై టార్పాలిన్లు పట్టాలు కప్పుకోవటం, మబ్బులు తేలిపోయాక మళ్లీ ధాన్యం ఆరబెట్టుకోవడం నిత్యకృత్యంగా మారింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో కల్లాలు, కేంద్రాల్లో ధాన్యం ఆరేందుకు ఇరవై రోజులు పడుతోంది. ఆరినా కొనుగోళ్లు ఆలస్యమవుతుండటంతో వర్షాలకు మళ్లీ తడుస్తున్నాయి. కొన్నిచోట్ల వరి కోసిన నెలరోజులకు కూడా అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఇప్పటివరకు సగం కూడా పూర్తికాలేదు. అకాల వర్షాలు, కొనుగోళ్ల జాప్యంతో పలువురు రైతులు పచ్చి వడ్లనే తక్కువ ధరలకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముతున్నారు.
భారీ వర్షానికి తడిసిన ధాన్యం
జిల్లాలో ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పలు మండలాల్లో కల్లాల్లో, కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఉరుములు మెరుపులు కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు రాశులపై కప్పిన పరదాలు, టార్పాలిన్లు లేచిపోయాయి. దీంతో కొనుగోలుకు సిద్ధమైన ధాన్యం కూడా మళ్లీ తడిసింది. ఇప్పటికే రెండు మూడుసార్లు తడిసి ఆరబెట్టిన ధాన్యం మళ్లీ తడవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం, పాల్వంచ, ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో ఽ భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల ధాన్యపు రాశుల అడుగున నీరు చేరింది. మరికొన్ని చోట్ల ఆరబెట్టిన ధాన్యంలో నీరుపారింది. సిమెంట్ కాంక్రీట్ ప్లాట్ఫామ్లు లేకపోవటంతో రైతులు పొలాల్లోనే పరదాలు వేసుకుని వడ్లు ఆరబోసుకున్నారు. అకాల వర్షాలతో భూమి నెమ్ముకుని అడుగు భాగంలో వడ్లు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం అమ్ముకునేందుకు రోజులు తరబడి ఉండాలంటే అకాల వర్షాలతో నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. తడిసిన వడ్లను కూడా కొనాలని కోరుతున్నారు.
అకాల వర్షాలతో తడుస్తున్న ధాన్యం
20 రోజులుగా వెంటాడుతున్న వానలు
కొనుగోలు కేంద్రాల్లో కాంటాలకు తీవ్ర జాప్యం

అన్నదాతకు కన్నీరు..