
ముంజల కోసం ఆగి మృత్యువాత
రఘునాథపాలెం: తాటి ముంజలు కొనుగోలు చేసేందుకు ఆగగా.. కారు ఢీకొన్న ఘటనలో తల్లీ కుమారుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని బూడిదంపాడు సమీపంలో ఖమ్మం – ఇల్లెందు ప్రధాన రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మహిళ భర్త కూడా తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. కామేపల్లి మండలం జాస్తిపల్లికి చెందిన బత్తుల వెంకటస్వామి తన భార్య శారద (31), కుమారుడు కార్తీక్ (12)తో కలిసి ఖమ్మం శ్రీనివాసనగర్లో బంధువుల ఇంటికి వచ్చాడు. వారు ఉప్పలమ్మ దేవతను పెట్టుకోగా, ఆ వేడుక పూర్తయ్యాక ద్విచక్ర వాహనంపై సాయంత్రం తిరిగి బయలుదేరారు. బూడిదంపాడు సమీపంలోని పవర్ గ్రిడ్ వద్ద తాటి ముంజల కోసం రోడ్డుకు కుడివైపున ఆగారు. కొనుగోలు చేశాక ప్రయాణం ప్రారంభించే సమయంలో ఖమ్మం నుంచి ఇల్లెందు వైపు వేగంగా వెళ్తున్న కారు వీరిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శారద, కార్తీక్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందగా, వెంకటస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ముంజలు విక్రయిస్తున్న వ్యక్తి కూడా గాయపడ్డాడు. వెంకటస్వామి ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యవసాయంపై ఆధార పడి జీవిస్తున్న ఆయన ఖాళీ సమయంలో సుతారి పనులు కూడా చేస్తుంటాడు. బీఆర్ఎస్ మండల బీసీ సెల్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నాడు. ఈ ఘటనపై సీఐ ఉస్మాన్షరీఫ్ కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో తల్లీ కుమారుడు మృతి

ముంజల కోసం ఆగి మృత్యువాత