
వేసవి క్రీడా శిబిరం ప్రారంభం
కొత్తగూడెంటౌన్: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో 30 వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఈ క్యాంప్ల్లో 1,200 మందికి పైగా విద్యార్థులకు 19 రకాల క్రీడల్లో నెల రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్రాజు, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ఈ క్యాంప్లు ఉపకరిస్తాయని, ప్రతీ క్రీడాకారుడు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించి జిల్లాకు పేరు తేవాలని అన్నారు. కాగా, ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో 16 క్యాంప్లు ఏర్పాటు చేసి క్రీడాకారులకు శిక్షణ ఇస్తుండగా ఈ ఏడాది ఆ సంఖ్య 30కి పెరిగింది. ఆయా క్యాంప్ల్లో అథ్లెటిక్స్, ఆర్చరీ, బాస్కెట్ బాల్, బాక్సింగ్, క్రికెట్, చెస్, ఫుట్బాల్, కరాటే, హాకీ, రైఫిల్ షూటింగ్, సాఫ్ట్బాల్ తదితర క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ ఎం.పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
30 మంది కోచ్లతో నెల రోజుల పాటు ఉచిత శిక్షణ
19 రకాల క్రీడల్లో దాదాపు 1,200 మందికి..
సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ

వేసవి క్రీడా శిబిరం ప్రారంభం