
ముందస్తు చర్యలేవి..?
ప్రభుత్వాస్పత్రుల్లో కిట్లు లేవు.. ల్యాబ్లు తెరుచుకోవు
● కోవిడ్ ఐసోలేషన్ వార్డు, బెడ్లు ఏర్పాటు చేయని వైద్యాధికారులు ● మరోవైపు జిల్లా ప్రజల్లో కరోనా భయం
కొత్తగూడెంఅర్బన్: దేశంలో పలుచోట్ల కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు ఒకింత ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం కేసులు లేనప్పటికీ ముందస్తు చర్యలు చేపట్టడంలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగిన ఏర్పాట్లు కూడా చేయడంలేదు. జలుబు, జ్వరం వంటి లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న రోగులకు డాక్టర్లు సాధారణ పారాసిటమోల్, సిట్రెజిన్ వంటి మాత్రలు ఇచ్చి పంపిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు కిట్లు కూడా లేవు. గతంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించిన ల్యాబ్లు ప్రస్తుతం మూతపడి ఉన్నాయి. ల్యాబ్ల్లో సిబ్బంది, టెక్నీషియన్లు కూడా అందుబాటులో లేరు. కరోనా సమాచారం తెలుసుకోవాలని ప్రజలు ప్రయత్నిస్తే జిల్లాలో కేసులు ఏమి నమోదు కాలేదు కదా..? అప్పుడే తొందర ఏమి ఉందని వైద్యాధికారులు కొట్టిపారేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. సిబ్బంది, వైద్యులకు మినహా ఇతరులకు ఆస్పత్రుల్లో కనీసం మాస్కులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు.
గతంలో 13,66,730 మందికి పరీక్షలు
జిల్లాలో గతంలో ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 13,66,730 మందికి నిర్వహించగా, 58,089 మందికి పాజిటివ్గా తేలింది. 572 మంది మృతి చెందినట్లు జిల్లా వైద్యా, ఆరోగ్యశాఖాధికారులు వెల్లడించారు. కొత్తగూడెం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ద్వారానే అత్యవసర రోగులకు ప్రాణవాయువు అందిస్తున్నారు. పాల్వంచ ఆస్పత్రిలో కూడా నవభారత్ యాజమాన్యం సోషల్ రెస్పాన్స్బులిటీ కింద ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు రేసింది. ప్రస్తుతం ఆ ప్లాంట్ ద్వారానే ఆస్పత్రిలోని అత్యవసర వార్డుల్లో ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. కాగా ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో ముందస్తు చర్యలు చేపట్టలేదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
సిద్ధంగా ఉన్నాం
జిల్లాలో కరోనా కేసులు నమోదు కాలేదు. కేసులు ఏమైనా నమోదయితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని సూపరింటిండెంట్లకు సూచించాం.
–భాస్కర్నాయక్, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి

ముందస్తు చర్యలేవి..?