పాల్వంచ: పాల్వంచలో 800 మెగావాట్ల సామర్థ్యం గల కేటీపీఎస్ ఏడో దశ కర్మాగారంలో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. జూలూరుపాడు వెళ్లే కరెంట్ ట్రాన్స్ఫార్మర్(సీటీ) స్విచ్యార్డు నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో లైన్ ట్రిప్ అయింది. వెంటనే కేటీపీఎస్ అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయమై సీఈ శ్రీనివాసబాబు మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్లో మంటలు రాగానే ఆర్పేశామని, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని తెలిపారు. ఉత్పతికి ఎలాంటి అవాంతరం లేదని, నష్టం కూడా పెద్దగా ఏమీ లేదని అన్నారు.
కారును ఢీకొట్టిన లారీ
అశ్వారావుపేటరూరల్: కారును వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టిన ఘటన సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. జంగారెడ్డిగూడెం మార్గంలోని రత్నం పెట్రోల్ బంక్ సమీపంలో అశ్వారావుపేట వైపు వస్తున్న కారును ఏపీ వైపు నుంచి వస్తున్న లారీ అదుపుతప్పి వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న అశ్వారావుపేటకు చెందిన చారి అనే వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
యువకుడిపై
పోక్సో కేసు నమోదు
అశ్వారావుపేటరూరల్: ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్న యువకుడిపై సోమవారం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం.. పట్టణంలోని వడ్డెర బజార్ ప్రాంతానికి చెందిన యువకుడు మేకల మారేష్ మండలంలోని ఓ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికను కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. వేధింపులు తట్టుకోలేక బాధితురాలు విషయాన్ని తన కుటుంబీకులకు చెప్పింది. దీంతో బాలిక తల్లి ఫిర్యాదు చేయగా, యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
బెల్లం, పటిక సీజ్
కొత్తగూడెంఅర్బన్: లక్ష్మీదేవిపల్లి మండలం దుబ్బ తండా గ్రామానికి చెందిన అజ్మీర గణేష్ నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం, పటికలను సోమవారం ఆటోలో తరలిస్తుండగా హేమచంద్రపురం దగ్గర వాహన తనిఖీలు చేపట్టిన కొత్తగూడెం ఎకై ్సజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. 108 కేజీల బెల్లం, 40కేజీల పటిక, 5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదుచేసినట్లు డీటీఎఫ్ ఎస్సై గౌతమ్ తెలిపారు.
(02కెజిఎం377): వివరాలు వెల్లడిస్తున్న ఎకై ్సజ్ అధికారులు
కేటీపీఎస్లో అగ్ని ప్రమాదం