
బార్ షాపు గుమస్తాపై నలుగురు దాడి..
పాల్వంచ: మద్యం సేవించేందుకు వెళ్లిన నలుగురు వ్యక్తులు బార్ షాపు గుమస్తా, మరో కస్టమర్పై దాడికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ వద్ద నవోదయ బార్ షాపునకు శనివారం సాయంత్రం మద్యం సేవించేందుకు వెళ్లిన చింతా వంశీ డబ్బులు ఇవ్వకుండా బీర్ బాటిల్ తీసుకున్నాడు. అనంతరం మరో బాటిల్ ఇవ్వాలని అక్కడి గుమస్తా వడ్డె నర్సింహారావును అడిగితే.. డబ్బులు ఇస్తేనే ఇస్తాననడంతో తాను లోకల్ అని, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇవ్వవా అంటు దురుసుగా ప్రవర్తించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. చింతా వంశీ అతడి స్నేహితులు కిషోర్, రఘు వరణ్, మణిశంకర్లు కలిసి వడ్డె నర్సింహారావుతో పాటు అక్కడి మరో కస్టమర్ అయిన కిరణ్రెడ్డిపై దాడికి పాల్ప డ్డారు. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో వారు పరార్ అయ్యారు. నర్సింహారావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైద్యం కోసం వెళ్లిన వ్యక్తి మృతి
చుంచుపల్లి: కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ విద్యానగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లిన ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఖమ్మం తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయికి చెందిన ప్రత్తిపాటి కోటేశ్వరరావు (55) వారం రోజుల క్రితం బీపీ ఎక్కువ కావడంతో విద్యానగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. ఇదే క్రమంలో శనివారం ఉదయం మళ్లీ తీవ్ర సమస్య తలెత్తడంతో వైద్యులు ఖమ్మానికి రిఫర్ చేయగా అంబులెన్స్లో తీసుకొస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈమేరకు మృతుడి కుమారుడు శ్రీనివాసరావు చుంచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
50 పశువుల పట్టివేత..
● గోశాలకు తరలింపు
ఇల్లెందు: పట్టణంలోని స్టేషన్ బస్తీ పెంకు ఫ్యాక్టరీ నుంచి హైదరాబాద్కు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 50 పశువులను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం రాత్రి స్టేషన్ బస్తీ నుంచి ఓ లారీలో తరలించేందుకు ఎక్కిస్తుండగా.. హిందూ ఐక్య వేదిక నేతలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ సత్యనారాయణ ఆధ్వర్యాన దాడి చేసి లారీ డ్రైవర్తో పాటు పశువులు తరలిస్తున్న మోబిన్, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఆతర్వాత పశువులను గోశాలకు తరలించారు. కాగా, పశువులు తరలిస్తున్న వ్యక్తులు పరారయ్యారు.
ముగ్గురు విలేకరులపై కేసు
ఖమ్మంక్రైం: ఖమ్మంకు చెందిన ముగ్గురు విలేకరులపై టూటౌన్ పోలీస్స్టేషన్లో శనివారం కేసు నమోదైంది. కారు పార్కింగ్ విషయమై ముగ్గురు విలేకరులు తనతో దౌర్జన్యంగా ప్రవర్తించారని ద్వారకానగర్కు చెందిన వెంకటకృష్ణ ప్రసాద్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అయితే, వెంకటకృష్ణ, ఆయన కుటుంబీకులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని విలేకరులు ఫిర్యాదు చేయగా ఇంకో కేసు నమోదు చేశామని సీఐ బాలకృష్ణ తెలిపారు.