కడతేర్చిన పాతకక్షలు.. | - | Sakshi
Sakshi News home page

కడతేర్చిన పాతకక్షలు..

Jun 8 2025 12:19 AM | Updated on Jun 8 2025 12:19 AM

కడతేర

కడతేర్చిన పాతకక్షలు..

భద్రాచలంలో యువకుడి దారుణహత్య..
● పాత గొడవల కారణంగా కత్తులతో దాడి ● మృతిచెందాడని నిర్థారించుకున్నాకే వెళ్లిన వైనం ● పోలుసులకు లొంగిపోయిన నిందితుడు

భద్రాచలంఅర్బన్‌: పాతకక్షల నెపంతో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఉదయాన్నే ఇంటికి వెళ్లి ఒక్కసారిగా దాడి చేసి కత్తులతో అతికిరాతకంగా పొడిచి మృతిచెందాడని నిర్థారించుకున్నాకే తిరిగి వెళ్లిన ఘటన ఇది. ఇంతటి ఉదాంతమైన సంఘటన శనివారం ఉదయం భద్రాచలం పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాచలం పట్టణంలోని ఏఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన కణితి సతీష్‌ (25)కు జగదీష్‌కాలనీకి చెందిన గుంజా సాయిరామ్‌కు మధ్య గడిచిన కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి వారిద్దరు భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద మరోమారు గొడవపడ్డారు. ఈ గొడవ కాస్త పెద్దదై అదేరోజు రాత్రి చర్లరోడ్డులో గల భద్రాచలం సరిహద్దున ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఇరువర్గాలకు చెందిన 40 మంది కొట్లాటకు దిగే సమయాన పోలీసులు వస్తున్నారనే సమాచారంతో అక్కడి నుంచి పారిపోయారు. దీంతో అక్కడ వదిలేసి వెళ్లిన మూడు ద్విచక్ర వాహనాలను స్టేషన్‌ కు తరలించి పరిశీలించగా.. ఓ స్కూటీలో రెండు కత్తులు ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు వాటిని సీజ్‌ చేశారు.

గొడవను మనసులో పెట్టుకుని..

శుక్రవారం రాత్రి జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న సాయిరామ్‌ శనివారం ఉదయం దాదాపు 15 మందిని తీసుకుని సతీష్‌ ఇంటి వెళ్లి తలుపు కొట్టి ఒక్కసారిగా అందరూ దాడికి దిగారు. ముందుగా అతడి కడుపులో కత్తితో పొడిచాక తర్వాత పీకమీద కిరాతకంగా పొడిచారు. కాగా, సతీష్‌ మృతి చెందాడని నిర్థారించుకునే వరకు అతడిపై 15 మంది దాడి చేసినట్లు సమాచారం. సతీష్‌ మృతి చెందాడని తెలుసుకున్నాక ఘటనా స్థలం నుంచి అందరూ వెళ్లిపోగా సాయిరామ్‌ మాత్రం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మిగిలిన వారు పరారీలో ఉన్నట్లు సమాచారం. అనంతరం సతీష్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సతీష్‌ వృతిరీత్యా భద్రాచలంలో ఆటో నడుపుతుండగా.. పాత కక్షలతోనే హత్యకు గురైనట్లు సమాచారం. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకులు స్థానిక పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. 15 మందిపై కేసు నమోదు చేసినట్లుగా సీఐ నాగరాజు తెలిపారు. కాగా, భద్రాచలం అర్ధరాత్రి సమయాన పోలీస్‌ పెట్రోలింగ్‌ పెంచి, పాత నేరస్తులపై నిఘా పెంచితే తప్ప ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.

కడతేర్చిన పాతకక్షలు..1
1/1

కడతేర్చిన పాతకక్షలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement