
పుణ్యస్నానాల కోసం వచ్చి..
భద్రాచలంఅర్బన్: గోదావరి పుణ్యస్నానాల కోసం వచ్చి ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గపరిధి రామాంతపూర్ నుంచి 13 మంది భక్తులు పట్టణంలోని భద్రాద్రి రామయ్యను దర్శించుకోవడానికి వచ్చారు. ఈనేపథ్యాన శుక్రవారం గోదావరిలో పుణ్యస్నానం చేస్తుండగా.. అఖిల్(7) అనే బాలుడు సైతం అందరితో పాటు స్నానం చేసేందుకు నదిలోకి దిగాడు. ఈక్రమంలో బాలుడు కనిపించకపోవడంతో అతడి తల్లి స్వప్న ఒక్కసారిగా అరుస్తుండడంతో స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లు అందులోకి దిగి బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 15 నిమిషాల తర్వాత అఖిల్ ఆచూకీ లభ్యమవడంతో గత ఈతగాడు ప్రసాద్ స్థానికుల సాయంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రి తీసుకెళ్లాడు. కాగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో కుమారుడు మృతదేహాన్ని ఒళ్లో పడుకోబెట్టుకొని గుండెలవిసేలా ఏడుస్తున్న హృదయవిదారకర సంఘటన అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. అఖిల్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడికి తల్లితో పాటు తండ్రి ధనంజి, అన్నయ్య ఉన్నాడు. కాగా, గోదావరిలో అధికారులు నది ఒడ్డున ఏర్పాటు చేసిన ఐరన్ ఫెన్సింగ్ను దాటి వెళ్తుండడంతో ఇటువంటి ఘటనలు జరుగున్నాయని స్థానిక గజ ఈతగాళ్లు చెబుతున్నారు.
గోదావరిలో మునిగి మృతిచెందిన బాలుడు