
కొత్త ఐటీఐలు ప్రారంభమయ్యేనా..?
● గత మార్చిలో ఇల్లెందు, అశ్వారావుపేటలకు మంజూరు ● ఐదు ట్రేడ్లతో 200 మంది విద్యార్థులకు అవకాశం ● ఇప్పటివరకు ఊసేలేని తరగతుల ప్రారంభోత్సవం
ఇల్లెందు: గత మార్చిలో ఇల్లెందు, అశ్వారావుపేటలకు ప్రభుత్వ ఐటీఐలు మంజూరు చేసింది. అయి తే విద్యాసంవ్సతరం సమీపిస్తున్నా వాటి ఏర్పాటు ప్రక్రియ కార్యరూపం దాల్చటం లేదు. దీంతో అడ్మిషన్లు జరుగుతాయా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇల్లెందు జేకే బస్టాఫ్ వద్ద గ్రంథాలయ సమీపంలో ఐటీఐ నిర్మించాలని నిర్ణయించారు. మార్చి 10న కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎమ్మె ల్యే కోరం కనకయ్య, సింగరేణి జీఎం కృష్ణయ్య తదితరులు స్థలాన్ని పరిశీలించారు. 13న స్థలం కేటాయిస్తున్నట్లు తహసీల్దార్ కలెక్టర్కు లేఖ అందజేయగా, కలెక్టర్ 15న స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి పంపించారు. ఇక అక్కడి నుంచి ఫైల్ ముందుకు కదలడంలేదు.
ఐదు ట్రేడ్లు.. 200 మంది విద్యార్థులు
నూతనంగా ఇల్లెందులో నెలకొల్పే ఐటీఐలో ఐదు ట్రేడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం విడుదల చేసిన జీఓలో పేర్కొంది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఐఓటీ, ఫ్యాషన్ డిజైనర్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వెహికల్ మెకానిక్ ట్రేడులు ప్రవేశ పెట్టనుండగా, ఒక్కో ట్రేడ్కు 40 మంది చొప్పున మొత్తం 200 మంది విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. కృష్ణసాగర్ ఐటీఐ వైస్ ప్రిన్సిపాల్ను, ఇక్కడి ఐటీఐకి ఇన్చార్జిగా నియమించారు. ఐటీఐలో ప్రిన్సి పాల్, వైస్ ప్రిన్సిపాల్తో పాటు ట్రైనింగ్ ఆఫీసర్, ఇతర సిబ్బంది 20 మంది వరకు ఉంటారు. ప్రభుత్వం అనుమతిస్తే తాత్కాలికంగా ఇల్లెందు వైటీసీ/ ప్రభుత్వ డిగ్రీ కళాశాల/14 నంబర్ బస్తీలోని హాస్టల్ భవనంలో ఐటీఐ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతన్నారు.
క్వార్టర్లు ఖాళీ చేయించటంలో జాప్యం
ఇల్లెందులో ఐటీఐ కోసం 609 సర్వే నంబర్లో 2.08 ఎకరాల స్థలం గుర్తించారు. అధికారులు పరిశీ లించిన స్థలంలోని సింగరేణి క్వార్టర్ల ఉంటున్నవారిని ఖాళీ చేయటంలో జాప్యం జరుగుతోంది. అశ్వారావుపేటలో సర్వే నెంబర్ 911/1లో మూడెకరాల స్థలం కేటాయించారు. గిరిజన ప్రాంతాల్లో ఐటీఐలు చేపట్టాల్సి ఉన్నందున కలెక్టర్ ప్రతిపాదనలు పంపిస్తే స్పెషల్ చీఫ్ సెక్రెటరీ నుంచి స్థలం కేటాయింపు జరగాల్సి ఉంది. ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కార్యాలయంలో ఫైల్ పెండింగ్లో ఉండగా, స్థలం కేటాయిస్తూ లేబర్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ నుంచి మంజూరు పత్రం విడుదల కావాల్సి ఉంది.
తరగతులకు అనుమతి ఇవ్వాలి
ఐటీఐ తరగతులు నిర్వహించేందుకు అనుమతి లభించాల్సి ఉంది. జూన్ 15న అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. కనీసం మలి విడత నోటిఫికేషన్ నాటికై నా తరగతులు నడిపేందుకు అనుమతి లభిస్తే ప్రైవేట్ భవనంలో అయినా తరగతులు నిర్వహిస్తాం. – జి.వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్
(ట్రైనింగ్ ఆఫీసర్), ఇల్లెందు ఐటీఐ